కరోనా ఆంక్షలు.. అమెరికా కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-10-16T03:02:33+05:30 IST

కరోనా ఆంక్షలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీకా తీసుకున్న విదేశీయులను దేశంలోకి అనుమతించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త విధానానికి సంబందించిన కీలక వివరాలను శ్వేతశౌధం అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.

కరోనా ఆంక్షలు.. అమెరికా కీలక నిర్ణయం!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా ఆంక్షలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీకా తీసుకున్న విదేశీయులను దేశంలోకి అనుమతించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త విధానానికి సంబంధించిన కీలక వివరాలను శ్వేతసౌధం అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. నవంబర్ 8 నుంచీ ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. వాస్తవానికి.. టీకా తీసుకున్న వారిని త్వరలో దేశంలోకి అనుమతిస్తామని బైడెన్ ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. అయితే..ఈ నిర్ణయాన్ని ఎప్పటి నుంచీ అమలు చేయబోతున్నారనేది మాత్రం వెల్లడించలేదు. 


ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కొన్ని దేశాల నుంచి వస్తున్న విదేశీయులను దేశంలోకి అనుమతించలేదు. ఐరోపా, బ్రెజిల్, భారత్, చైనా విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరించింది.  కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక.. కరోనా టీకా తీసుకున్న వారు విమాన ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. అందులో.. నెగెటివ్ ఫలితం వస్తే అమెరికాకు ప్రయాణం కట్టవచ్చు. ఈ క్రమంలో వారు.. కాంటాక్ట్ ట్రేసింగ్ వివరాలను అధికారులకు ఇచ్చేందుకు అంగీకరించాలి. 


ఇక టీకా తీసుకోని వారికి గతంలో మాదిరిగానే అమెరికాలో ప్రవేశించేందుకు అర్హత ఉండదు. వ్యాక్సిన్ తీసుకోని అమెరికా జాతీయులు ముందుగా కరోనా పరీక్ష చేయించుకుని నెగెటివ్ ఫలితం వచ్చినట్టు చూపిస్తేనే అధికారులు ప్రయాణానికి అనుమతిస్తారు. కొత్త రూల్స్ ప్రకారం.. అమెరికాలోని ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) గుర్తింపు పొందిన టీకాలతో పాటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర అనుమతి పొందిన టీకాలను కూడా అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుంది. దీంతో.. చైనా సంస్థ సైనోఫార్మ్ టీకా లేదా ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకా తీసుకున్న వారికీ అమెరికాకు వెళ్లేందుకు అనుమతి లభించినట్టైంది. అయితే.. రెండు డోసుల్లో రెండు వేరు వేరు రకాల టీకాలు తీసుకున్న వారి పరిస్థితి ఏంటనేదానిపై ఇంకా స్పష్టత లేదు. 

Updated Date - 2021-10-16T03:02:33+05:30 IST