అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు: ఒలింపిక్స్ బాయ్‌కాట్‌పై చైనా హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-09T22:09:14+05:30 IST

మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న వింటర్ ఒలింపిక్స్‌ను అమెరికా దౌత్యపరంగా బహిష్కరించడంపై చైనా

అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు: ఒలింపిక్స్ బాయ్‌కాట్‌పై చైనా హెచ్చరిక

బీజింగ్: మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న వింటర్ ఒలింపిక్స్‌ను అమెరికా దౌత్యపరంగా బహిష్కరించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ‘చూస్తూ ఉండండి’  అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.


వింటర్ ఒలింపిక్స్ రాజకీయ ప్రదర్శనకు వేదిక కాదని అన్నారు. అమెరికా చర్యలు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ పరువును మంటగలిపేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు, పుకార్ల ఆధారంగా సైద్ధాంతిక పక్షపాతంతో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో జోక్యం చేసుకునేందుకు యూఎస్ చేస్తున్న ప్రయత్నం దాని చెడు ఉద్దేశాలను బహిర్గతం చేస్తోందని దుయ్యబట్టారు. 


బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్య బహిష్కరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికా ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. మరోవైపు, అమెరికా బాటలోనే మరిన్ని దేశాలు నడుస్తున్నాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, లిథువేనియా వంటి దేశాలు వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్య బహిష్కరణ చేయనున్నట్టు ప్రకటించగా తాజాగా, కెనడా కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. మానవ హక్కుల ఉల్లంఘన, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో తెలిపారు. కాగా, వింటర్ ఒలింపిక్స్‌ బహిష్కరణపై ఫ్రాన్స్ కూడా త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Updated Date - 2021-12-09T22:09:14+05:30 IST