బీజేపీని ఘాటుగా హెచ్చరించిన మనోహర్ పారికర్ కుమారుడు

ABN , First Publish Date - 2021-11-18T21:40:10+05:30 IST

రానున్న గోవా శాసన సభ ఎన్నికల్లో పోటీ

బీజేపీని ఘాటుగా హెచ్చరించిన మనోహర్ పారికర్ కుమారుడు

పనజీ : రానున్న గోవా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే కఠిన నిర్ణయం తీసుకోవలసి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ హెచ్చరించారు. తన తండ్రి 25 ఏళ్ళకు పైగా ప్రాతినిధ్యంవహించిన పనజీ శాసన సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం తనకే ఇవ్వాలన్నారు. అయితే తనకు ఈ అవకాశం లభిస్తుందని పూర్తి నమ్మకం ఉందన్నారు. పనజీ నుంచి పోటీ చేయాలనే తన కోరికను బీజేపీ అధిష్ఠానానికి ఇప్పటికే చెప్పానన్నారు. ఆ అవకాశాన్ని పార్టీ ఇస్తుందనే సంపూర్ణ నమ్మకం తనకు ఉందన్నారు. 


పనజీ నుంచి 2017 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచిన అటనసియో మోన్సెరాటే, మరికొందరు నేతలు బీజేపీలో ఇటీవల చేరారు. ఈ నేపథ్యంలో బీజేపీ టిక్కెట్ నిరాకరిస్తే ఏం చేస్తారని మీడియా ప్రశ్నించినపుడు ఉత్పల్ పారికర్ మాట్లాడుతూ, తాను కఠిన నిర్ణయం తీసుకోవలసి వస్తుందన్నారు. పనజీ నుంచి తాను పోటీ చేస్తానని బీజేపీకి ఇప్పటికే చెప్పానన్నారు. దీనిపై మరింత వివరణ ఇవ్వాలని కోరగా, ఇది సరైన సమయం కాదన్నారు. దీని గురించి తాను ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. మనోహర్ పారికర్ తన జీవితంలో దేనినీ సులువుగా పొందలేదన్నారు. అదే విధంగా తాను కూడా తనకు కావలసినదాని కోసం కృషి చేస్తానన్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడవచ్చునని, తనకు శక్తినివ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చినపుడు తాను ప్రజల మాట వింటానన్నారు. తాను పార్టీకి చెప్పానని, పార్టీ తనకు టిక్కెట్ ఇస్తుందని, ఆ నమ్మకం తనకు ఉందని చెప్పారు. 


ఇదిలావుండగా, గోవా బీజేపీ శాఖ అధ్యక్షుడు సదానంద్ షేట్ టనవడే మాట్లాడుతూ, శాసన సభ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపై పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ టిక్కెట్‌ను ఎవరైనా కోరవచ్చునని తెలిపారు. తాను ఇటీవల ఉత్పల్ పారికర్‌ను కలిశానని, పార్టీ టిక్కెట్ గురించి తాము మాట్లాడుకోలేదని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-18T21:40:10+05:30 IST