భార్య తల నరికి..దాంతో పోలీసుస్టేషనుకు వెళ్లిన భర్త

ABN , First Publish Date - 2020-10-10T12:50:49+05:30 IST

అనుమానంతో భార్య తల నరికి, దాన్ని చేతిలో పట్టుకొని పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయిన భర్త ఉదంతం....

భార్య తల నరికి..దాంతో పోలీసుస్టేషనుకు వెళ్లిన భర్త

లక్నో (ఉత్తరప్రదేశ్): అనుమానంతో భార్య తల నరికి, దాన్ని చేతిలో పట్టుకొని పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయిన భర్త ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బండా జిల్లాలో జరిగింది. బండా జిల్లా బాబేరు పట్టణానికి  చెందిన కిన్నార్ యాదవ్ మార్నింగ్ వాకింగుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినపుడు అతని భార్య విమల (35) పొరుగింటి వ్యక్తి రవికాంత్ తో మాట్లాడుతున్నట్లు గుర్తించాడు. భార్య విమలపై అనుమానంతో కిన్నార్ యాదవ్ గొడ్డలితో ఆమె తల నరికి దాన్ని చేత్తో తీసుకొని రెండుకిలోమీటర్లదూరంలోని పోలీసుస్టేషనుకు కాలినడకన వెళ్లి లొంగిపోయాడు. రవికాంత్ పై కూడా యాదవ్ దాడి చేశాడు. యాదవ్, విమల దంపతులకు భగత్, ప్రహ్లాద్ అనే ఇద్దరు కుమారులున్నారు.పిల్లలిద్దరూ సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేరు. 


భార్య తలతో యాదవ్ రోడ్డుపై నడచి వెళ్లిన యాదవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాదవ్ పై భారత శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర పి చౌహాన్ చెప్పారు. తన భార్య విమలకు ఎలక్ట్రీషియన్ రవికాంత్ తో సంబంధం ఉందని అనుమానించానని, ఆమె తరచూ అతనితో మాట్లాడటం చూశానని యాదవ్ పోలీసులకు చెప్పాడు.

Updated Date - 2020-10-10T12:50:49+05:30 IST