లఖీంపూర్ ఘటనలో 9కి పెరిగిన మృతుల సంఖ్య
ABN , First Publish Date - 2021-10-04T18:15:35+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖీరీ ఘటనకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు...
యూపీ: ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖీరీ ఘటనకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసనకు రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. సాగు చట్టాల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా ఆదివారం హింసాత్మక ఘటనలో మరణించినవారి సంఖ్య 9కి చేరింది. తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోవైపు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఆయనతోపాటు 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ప్రస్తుతం లఖీంపూర్ ఖీరీలో పరిస్థితి ఉద్రిక్తతగా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ నిలిపివేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. రాజకీయ నేతలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఘటన జరిగిన తికునియా గ్రామం చుట్టూ భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రయత్నించడంతో సీతాపూర్ వద్ద పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రియాంక పోలీసులతో వాదనకు దిగారు. రైతులను పరామర్శించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు.