మృతి చెందిన ఉపాధ్యాయునికి జీతం, ఇంక్రిమెంట్... ఇదీ కథ!
ABN , First Publish Date - 2020-08-13T10:53:17+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని పీలీభీత్లో ఒక ఆశ్చర్యకర ఉదంతం చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం మృతిచెందిన ఉపాధ్యాయునికి విద్యాశాఖ ఇంకా అతని ఖాతాలోకి జీతం జమచేస్తూనే ఉంది. ఇంతేకాదు ఆ మృతిచెందిన...
పీలీభీత్: ఉత్తరప్రదేశ్లోని పీలీభీత్లో ఒక ఆశ్చర్యకర ఉదంతం చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం మృతిచెందిన ఉపాధ్యాయునికి విద్యాశాఖ ఇంకా అతని ఖాతాలోకి జీతం జమచేస్తూనే ఉంది. ఇంతేకాదు ఆ మృతిచెందిన ఉపాధ్యాయునికి ఇంక్రిమెంట్ కూడా వచ్చిన విషయం వెలుగు చూసింది. ఈ ఉదంతం విద్యాశాఖ ఉన్నతాధికారులకు చేరడంతో కలకలం చెరేగింది. అయితే ఇప్పుడు వారు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే అరవింద్ కుమార్ అనే ఉపాధ్యాయుడు 2015, నవంబర్ 5 న పీలీభీత్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియామకం పొందారు. ఏడాది తరువాత అంటే 2016, మే22న అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈ నేపధ్యంలో మృతుని భార్య వందన తన వారసత్వ ఉద్యోగ నియామకం కోసం ప్రాథమిక విద్యాశాఖాధికారి దేవేంద్ర స్వరూప్ను ఇటీవల కలుసుకున్నారు. ఈ సందర్బంలో ఆయన అరవింద్ జీతం గురించి జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారిని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో 2016 నుంచి కూడా ఆ ఉపాధ్యాయుని ఖాతాకు జీతం విడుదలవుతోందని తేలింది. దీంతో జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి దేవేంద్ర స్వరూప్ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా దేవేంద్ర స్వరూప్ మాట్లాడుతూ, ఆ ఉపాధ్యాయుడు మరణించినప్పటికీ, అతని ఖాతాలోకి జీతం వెళుతున్నదన్నారు. అయితే అతని స్థానంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అతని భార్య వచ్చినప్పుడు, ఈ విషయం వెలుగు చూసిందన్నారు. దీనికి కారకులైనవారిపై చర్యలు చేపడతామని తెలిపారు.