ఉత్తరాంధ్రది గొప్ప ఉద్యమ చరిత్ర
ABN , First Publish Date - 2021-12-08T05:59:27+05:30 IST
ఉత్తరాంధ్రకు గొప్ప ఉద్యమ చరిత్ర ఉందని ప్రొఫెసర్ కేఎస్ చలం అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి, రచయిత ఎ.అజశర్మ రచించిన ఇంకెన్నాళ్లీ వెనుకబాటు?- ఉత్తరాంధ్ర అభివృద్ధి వ్యూహం పుస్తకాన్ని ద్వారకానగర్ విశాఖ పౌర గ్రంథాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు.
ప్రొఫెసర్ కేఎస్ చలం
ఇంకెన్నాళ్లీ వెనుకబాటు- ఉత్తరాంధ్ర అభివృద్ధి వ్యూహం పూస్తకావిష్కరణ
సీతంపేట, డిసెంబరు 7: ఉత్తరాంధ్రకు గొప్ప ఉద్యమ చరిత్ర ఉందని ప్రొఫెసర్ కేఎస్ చలం అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి, రచయిత ఎ.అజశర్మ రచించిన ఇంకెన్నాళ్లీ వెనుకబాటు?- ఉత్తరాంధ్ర అభివృద్ధి వ్యూహం పుస్తకాన్ని ద్వారకానగర్ విశాఖ పౌర గ్రంథాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. పీపుల్స్ ఫర్ ఇండియా కన్వీనర్ ఎం.కామేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయాలని, గిరిజన ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గౌరవ అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపన తురువాతే విశాఖ నగరం అభివృద్ధి చెందిందని, కానీ ప్రధాని మోదీ స్టీల్ప్లాంట్తో సహా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పగించాలని చూస్తున్నారన్నారు. మరో అతిథి కళా ఆస్పత్రి అధినేత డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ ఏజన్సీలో రవాణా, వైద్య సౌకర్యాలు మెరుగుపడాలన్నారు. పుస్తక రచయిత అజ శర్మ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో అపార వనరుల మధ్యే తీవ్ర పేదరికం ఉందని, దీనిని మార్చడానికి ఉద్యమాలే శరణ్యమన్నారు. కార్యక్రమంలో వైజాగ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ సెక్రటరీ రవి గోడే, జర్నలిస్ట్ శివశంకర్, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు ఎన్.నాగేశ్వరరావు, ఏవీఆర్కే మూర్తి, బీబీ గణేష్, ఎల్ఐసీ యూనియన్ నేత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.