అన్ని మండలాల్లో వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-01-20T06:25:35+05:30 IST
ప్రస్తుతం నియోజకవర్గానికి రెండు చొప్పున కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలుండగా.. ఇక నుంచి ప్రతి మండలంలోనూ ఓ పీహెచ్సీలో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమాయ్యరు.
155 కేంద్రాల కోసం ప్రతిపాదనలు
రోజురోజుకూ తగ్గుతున్న వ్యాక్సినేషన్ శాతం
చిత్తూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం నియోజకవర్గానికి రెండు చొప్పున కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలుండగా.. ఇక నుంచి ప్రతి మండలంలోనూ ఓ పీహెచ్సీలో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమాయ్యరు. మంగళవారం రాత్రి దీనికి సంబంధించిన ఆన్లైన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే బుధవారం నుంచి, లేకుంటే గురువారం నుంచి అన్ని మండలాల్లోనూ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 155 వ్యాక్సినేషన్ కేంద్రాలకు అనుమతి కావాలని ప్రతిపాదనలు పంపినట్లు జేసీ వీరబ్రహ్మం తెలిపారు. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ వేసుకునేవారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ తగ్గుతోంది. ఈనెల 16 నుంచి జిల్లాలోని 29 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. తొలిరోజు 72 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోగా.. మంగళవారానికి ఈ శాతం 37.7కి పడిపోయింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకునేవారి సంఖ్యను పెంచడానికి అధికారులు కొత్తగా కేంద్రాలను పెంచుతున్నారు. ప్రస్తుతానికి భయాందోళన కారణంగా అధికంగా గైర్హాజరు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తొలి విడతలో జిల్లాలోని 35 వేల మంది మెడికల్ స్టాఫ్కు వ్యాక్సిన్ వేసేందుకు 41,500 డోసుల వ్యాక్సిన్ జిల్లాకు చేరిన విషయం తెలిసిందే.
నాలుగు రోజుల్లో 5,199 మందికి టీకా
చిత్తూరు రూరల్, జనవరి 19: జిల్లావ్యాప్తంగా నాలుగు రోజులుగా 10,036 మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఆన్లైన్లో షెడ్యూలింగ్ చేశారు. ఇందులో మంగళవారానికి 5,199 మంది మాత్రమే టీకా వేసుకున్నారు. కేంద్రాల వారీగా.. గుడిపాలలో 150 మందికిగాను 100 మంది టీకా వేసుకున్నారు. గుర్రంకొండలో 22మందికి ఆరుగురు, మదనపల్లెలో 135మందికి 70 మంది, సీటీఎంలో 127మందికి 98 మంది, ఎస్ఎన్పురంలో 101మందికి 35మంది, చౌడేపల్లెలో 55మందికి 20మంది, గంగవరంలో 64మందికి 15మంది, పెద్దపంజాణిలో 65 మందికి 29మంది, కుప్పంలో 150మందికి 107 మంది, మేడకుర్తిలో 163మందికి 51మంది, తుంబకుప్పంలో 122మందికి 29 మంది, ములకలచెరువులో 139మందికి 78మంది, జీడీ నెల్లూరులో 51మందికి 15మంది, కార్వేటినగరంలో 79మందికి 35మంది, మంగళంలో 100మందికి 29మంది, భాకరాపేటలో 43మందికి ఐదుగురు, నాగలాపురంలో 126మందికి 83మంది, స్విమ్స్లో 200మందికి 10మంది, తిరుపతి మెర్నిటీ ఆస్పత్రిలో 200 మందికి 40మంది, నగరిలో 100 మందికి 64మంది, పుత్తూరులో 131 మందికి 45మంది, శ్రీకాళహస్తిలో 75 మందికి 32మంది, రేణిగుంటలో 200 మందికి 70మంది, పుంగనూరులో 156 మందికి 68మంది, అపోలో మెడికల్ కళాశాలలో 200 మందికి 54మంది, ఆర్వీఎస్ ఆస్పత్రిలో 200 మందికి 17మంది, ఎర్రావారిపాళెంలో 143 మందికి 74మంది టీకా వేయించుకున్నారు. తిరుపతి నెహ్రూనగర్లో 100 మందికిగాను ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి రాలేదు. స్విమ్స్లోనూ 200 మందికి కేవలం 10 మంది హెల్త్ వర్కర్లు మాత్రమే టీకా వేయించుకున్నారు.
40 మందికి కరోనా
తిరుపతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమ, మంగళవారాల మధ్య 24 గంటల వ్యవధిలో 40మందికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వీటిలో తిరుపతి నగరంలో 6, పాకాల, విజయపురం మండలాల్లో 5 వంతున, మదనపల్లెలో 4, తవణంపల్లె, తిరుపతి రూరల్, చిత్తూరు మండలాల్లో 3 వంతున, గుర్రంకొండ, కురబలకోట, ఎర్రావారిపాలెం, చంద్రగిరి, కార్వేటినగరం, ములకలచెరువు, నగరి, పీలేరు, పుంగనూరు, సదుం, వడమాలపేట మండలాల్లో ఒక్కొక్కటి వంతున కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 89516కు చేరుకోగా.. మంగళవారం ఉదయానికి 138 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయి.
నాలుగు రోజులగా వ్యాక్సిన్ వేసుకున్నవారి వివరాలు
రోజు లక్ష్యం వేసుకున్నవారు శాతం
శనివారం 2355 1702 72.3
ఆదివారం 2426 1228 50.6
సోమవారం 1822 976 53.6
మంగళవారం 3433 1293 37.7