కోటి మందికిపైగా వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-06-03T09:50:28+05:30 IST
రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
25.35 లక్షల మందికి రెండు డోసులూ పూర్తి: సింఘాల్
అమరావతి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి 1,00,82,648 డోసులు వేశామని చెప్పారు. వాటిలో 25,35,189 మందికి రెండు డోసులూ పూర్తి చేశామని, 50,12,270 మందికి తొలి డోసు వేశామని వెల్లడించారు. విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు, ఉద్యోగులకు వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. వ్యాక్సినేషన్లో దేశ సగటును మించి టీకాలు వేసిన ఘనత ఏపీకే దక్కుతుందని ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి, రెండో డోస్ కలిపి కోటి మందికిపైగా లబ్ధిదారులకు అందించామని చెప్పారు. 15 శాతం మందికి టీకాలు అందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు.