వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-12-04T06:33:55+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ను మరింత వేగవం తం చేస్తూ అర్హులైన వారందరికీ అందించే విధంగా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ అ న్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ రాజేష్చంద్రలతో పాటు పలువురు అధికారులు ఎరోడ్రమ్ వద్ద పూల మొక్కను అందించి ఘనస్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్
జిల్లాకేంద్రంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం
ఆదిలాబాద్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): కొవిడ్ వ్యాక్సిన్ను మరింత వేగవం తం చేస్తూ అర్హులైన వారందరికీ అందించే విధంగా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ అ న్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ రాజేష్చంద్రలతో పాటు పలువురు అధికారులు ఎరోడ్రమ్ వద్ద పూల మొక్కను అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా అధికారుల సమావేశానికి హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో మండల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్సెంటర్ గ్రామాల వారీగా నోడల్ అధికారులను నియమించి వ్యాక్సినేషన్ను పెంచే విధంగా అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్నారు. పట్టణ ప్రాంతంలో వార్డుల వారీగా నోడల్ అధికారులను నియమించి వ్యాక్సినేషన్ అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో విస్త్రృత అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ పంపిణీ చేయాలన్నారు. ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులు, కలెక్టర్ గ్రామాల్లో పర్యటించి వ్యాక్సిన్ పంపిణీ విధనాన్నిపర్యవేక్షించాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు గా 17లక్షల 6వేల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ నెల 22 నాటికి టార్గెట్ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఒమైక్రాన్ థర్డ్వేవ్ వ్యాప్తి చెందక ముందే ప్రతీ ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ను అందించాలన్నారు. ఇందులో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ఆలీ ముర్తుంజా రిజ్వీ, మంచిర్యాల కలెక్టర్ భారతి హోలీకేరి, కొమ్రంభీం కలెక్టర్ రాహుల్రాజ్, నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ ఆలీ ఫారుకి, ఐటీడీఏ పీవో అంకిత్, వివిధ జిల్లాల వైద్యాధికారులు, ఆయా మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సీఎస్కు వినతుల వెల్లువ
ఆదిలాబాద్ టౌన్, డిసెంబరు 3: రెవెన్యూలో కీలకంగా ఉన్న వీఆర్వోలను విధుల నుంచి తప్పించి యేడాదిన్నర కాలం కావస్తోందని, ఇప్పటికైనా రెవెన్యూ, వివిధ శాఖల్లో విలీనం చేస్తూ విధులు కేటాయించాలని జిల్లా వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందించారు. కాగా, జిల్లా ప్రధాన కార్యదర్శి వామన్రావు, ఇతర వీఆర్వోలు తమ సమస్యను వివరించారు. దీనికి స్పందించిన సీఎస్ వీఆర్వోలకు త్వరలో విధులు కేటాయిస్తామని వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
అలాగే, ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు సీఎస్ను కలిసి వినతి పత్రం అందించారు. జిల్లా కేంద్రానికి వచ్చిన సీఎస్కు కలెక్టర్ సమావేశ మందిరం వద్ద తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఇందులో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మోహన్నాయక్, సభ్యులు నసీరోద్దిన్, ఇతర సహోద్యుగులు పాల్గొన్నారు. కాగా, సీఎస్ సోమేశ్కుమార్ను పలువురు టీఎన్జీవోస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఎస్కు విన్నవించారు. వారిలో జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి నవీన్కుమార్, రాష్ట్ర నాయకులు తిరుమలరెడ్డి, తదితరులున్నారు.
ఫసల్బీమా డబ్బులను చెల్లించాలి : బీజేపీ
సీఎస్ సోమేష్కుమార్ను బీజేపీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిసి రైతులకు రావాల్సిన ఫసల్ బీమా డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ జిల్లాలో 2018-19, 2019-20 గానూ చెల్లించాల్సిన ఫసల్ బీమా డబ్బులు ప్రభుత్వం ఇంత వరకు చెల్లించ లేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అలాగే, ఆదిలాబాద్ మండలంలో కచికంటి గ్రామానికి చెందిన రైతు దత్తు నకిలీ మందుల భారీన పడి తీవ్ర నష్టానికి గురయ్యారని ఇది బయోఫర్టిలైజర్ వల్లనే జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం రైతు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.