వ్యాక్సిన్ మైలురాయిపై కార్పొరేట్ల హర్షం
ABN , First Publish Date - 2021-10-22T09:10:13+05:30 IST
భారతదేశం కరోనా వ్యాక్సిన్లలో 100 కోట్ల మైలురాయిని దాటడం పట్ల పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు హర్షం ప్రకటించాయి.
న్యూఢిల్లీ: భారతదేశం కరోనా వ్యాక్సిన్లలో 100 కోట్ల మైలురాయిని దాటడం పట్ల పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు హర్షం ప్రకటించాయి. ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి దిశగా పరుగులు తీయడానికి, మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి ఇది ఉపయోగపడుతుందని వారన్నారు. ఇది అద్భుత విజ యం. ముకుళిత హస్తాలతో జైహింద్ అన్న ప్రధాని సందేశాన్ని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ట్వీట్ చేశారు.
ఎవరేమన్నారు..
100 కోట్ల వ్యాక్సిన్ మైలురాయి.. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమం సాధించిన విజయం. భారీ జనాభా సహా పలు సవాళ్లు ఎదురైనా సాధించిన ఈ మైలురాయి భారతీయులందరికీ గర్వకారణం. ఈ ఏడాది డిసెంబరు నాటికి సంపూర్ణ వ్యాక్సినేషన్ లక్ష్యం సాధించేందుకు ప్రభుత్వానికి మా సహకారం అందిస్తాం. పిల్లలు, యుక్తవయసులోని వారికి కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు మేం ఏర్పాట్లు చేస్తున్నాం.
-ప్రతాప్.సి.రెడ్డి, చైర్మన్, అపోలో హాస్పిటల్స్
ఇది పరిశోధకులు, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ రంగ సిబ్బంది, పరిపాలనా బృందాలు, పోలీసు సిబ్బంది అందరి విజయం. వారు చేసిన కృషి, త్యాగాలు అసాధారణం, అభినందనీయం. ఇది భారత్ను అధిక వృద్ధి బాటలో నిలుపుతుంది.
- టీవీ నరేంద్రన్, ప్రెసిడెంట్, సీఐఐ
రాబోయే కొద్ది వారాలు, నెలల్లో అర్హులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసి సంపూర్ణ వ్యాక్సినేషన్ చరిత్ర సాధ్యమేనన్న విశ్వా సం ఈ విజయం కల్పించింది. వినియోగదారుల విశ్వాసం మరింతగా ఇనుమడిస్తుంది.
- దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం
సంపూర్ణ వ్యాక్సినేషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రదర్శించిన ముందుచూపుతో కూడిన నాయకత్వం, ఆర్థిక సంస్కరణలు రాబోయే కాలంలో భారత్ను పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా నిలుపుతాయి.
- చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ