టీకా కోసం తిప్పలు
ABN , First Publish Date - 2021-05-14T14:56:29+05:30 IST
ప్రభుత్వం కొవిడ్ టీకాలు వేసేందుకు..
మొదటి డోసు వేసుకున్నప్పుడు ఇచ్చిన ఫోన్ నంబర్కు ఓటీపీ
ఓటీపీ లేకుంటే వ్యాక్సిన్ నిరాకరణ
ఆగిరిపల్లి(కృష్ణా): ప్రభుత్వం కొవిడ్ టీకాలు వేసేందుకు ఎప్పటికప్పుడు నిబంధనలు సడలిస్తుండటం వ్యాక్సిన్లు వేయించుకునేవారికి సంకటంగా మారింది. బుధవారం రెండో డోసు వేస్తామని అధికారులు వ్యాక్సినేషన్ సెంటర్లకు రావాలని వలంటీర్ల ద్వారా టోకెన్లు పంపిణీ చేశారు. తీరా అందరూ వచ్చాక, కలెక్టర్ ఆదేశాలతో టీకాలు వేసే కార్యక్రమం నిలిపివేశామన్నారు. మళ్లీ గురువారం మొదటి డోసు కొవిషీల్డ్ టీకా వేసిన వారికి 42 రోజులు గడిచినవారికి (6 నుంచి 8 వారాల లోపు) మాత్రమే రెండో టీకా వేస్తామని టోకెన్లు ఇచ్చిన వారిని కూడా వెనక్కు పంపేయడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. రెండో డోసు టీకా కోసం వైద్య శాఖ మరో మెలిక పెట్టింది. మొదటి డోసు టీకా వేయించుకున్నప్పుడు వైద్య సిబ్బంది దగ్గర నమోదు చేయించిన సెల్ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ చెబితేనే రెండో టీకా వేసేందుకు అనుమతి వస్తుంది. అలాకాకుండా మొదటి డోసు వేసినప్పుడు ఇచ్చిన సెల్నంబర్ లేకపోయినా వ్యాక్సినేషన్ సెంటర్కు వచ్చినా రెండో డోసు వేసే అవకాశం లేదని కొవిడ్ వైద్యుడు ప్రసాద్బాబు తెలిపారు.
దీంతో నిరక్ష్యరాస్యులు నిబంధనలు తెలియక వ్యాక్సిన్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ అగచాట్లు పడుతున్నారు. అయితే మొదట్లో పెట్టిన నిబంధనలు సడలించి టీకా, టీకాకు మధ్య వ్యవధిని పెంచడం పట్ల ఆంతర్యం తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అర్హులందరికీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో వైద్యులు వచ్చేవారికి సర్ది చెప్పలేక నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు సిఫార్సులు కూడా వారి బాధ్యతల నిర్వహణలో ఒత్తిడిని పెంచుతున్నాయని వాపోతున్నారు.
సంక్షేమ పథకాలు నిలిపి వేసైనా వాక్సిన్ వేయాలి
రాష్ట్రంలో ఓ నెల సంక్షేమ పథకాలు నిలిపివేసైనా ఆ సొమ్ముతో వాక్సిన్ కొనుగోలు చేసి అందరికీ వాక్సిన్ ఇచ్చి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని కాపాడాలి.
- చిమట నాని, ఆగిరిపల్లి
మండలానికో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలి
మండలానికో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. పాజిటివ్ వచ్చిన రోగులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. రోగులకు భరోసా కల్పించాలి.
- మోహనరావు, వంటమేస్త్రి, తోటపల్లి