ఏడాది తర్వాతే కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్: ఎయిమ్స్ చీఫ్
ABN , First Publish Date - 2021-10-24T00:15:44+05:30 IST
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్లు ఎప్పుడనే దానిపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా శనివారంనాడు వివరణ ఇచ్చారు. ఏడాది తర్వాతే...
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్లు ఎప్పుడనే దానిపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా శనివారంనాడు వివరణ ఇచ్చారు. ఏడాది తర్వాతే ఉండవచ్చని, అది కూడా వైరస్ నుంచి పరిరక్షణ విషయంలో రెండు డోసుల ప్రభావం ఏ విధంగా ఉందనే అంశంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే, కోవిడ్ బూస్టర్ డోసులు వచ్చే ఏడాది ఏదో ఒక సమయంలో అనివార్యం కావచ్చని అన్నారు. పిల్లల వాక్సిన్ డోసులపై తాను గట్టి నమ్మకంతో ఉన్నానని, త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయని కూడా డాక్టర్ గులేరియా చెప్పారు.
''బూస్టర్ల టైమ్లైన్ గురించి నా వద్ద స్పష్టమైన సమాధానం లేదు. యాంటీబాడీలను ఆధారం చేసుకుని బూస్టర్ షాట్లను మనం నిర్ణయించలేం. టైమ్ను బట్టే ఉంటుంది. సెకెండ్ డోస్ తీసుకున్నప్పటి నుంచి ఎంత సమయం పడుతుందనే దాన్ని బట్టే ఉంటుంది. సహజంగా ఒక ఏడాది తర్వాతే బూస్టర్ షాట్ల వైపు దృష్టి సారించడం ఉంటుంది'' అని డాక్టర్ గులేరియా తెలిపారు. బూస్టర్ డోస్ల విషయమై మరింత డాటా తమకు అవసరమని అన్నారు. యూకేలో కేసులు పెరగడం, ఆసుపత్రి పాలుకావడం, మరణాలు సంభవించడం వంటివి చూశామని, దానిని దృష్టిలో ఉంచుకుంటే మనం సురక్షిత జోన్లో ఉన్నామని చెప్పారు. వైరస్ మ్యుటేట్ అయితే మాత్రం సాధ్యమైనంత త్వరగానో, ఆ తర్వాతో బూస్టర్లు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని ఆయన వివరించారు. డాక్టర్ గులేరియా అభిప్రాయాలనే ఇటీవల సెరుమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా వ్యక్తం చేశారు. బూస్టర్ల గురించి ఆలోచించడానికి ఏడాదికి పైనే పట్టొచ్చని ఆయన పేర్కొన్నారు.