నేడూ టీకా బంద్
ABN , First Publish Date - 2021-05-17T05:11:34+05:30 IST
నేడూ టీకా బంద్
రెండోడోసు కోసం వేలాది మంది ఎదురుచూపు
ఖమ్మం సంక్షేమవిభాగం, మే 16: వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం కూడా నిలిపివేస్తూ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు డీఎంహెచ్వోలకు సమా చారం అందించింది. రాష్ట్రంలో తగినన్ని టీకాలు లేకపోవడం, కేంద్రం ఉంచి తగినంత కోటా రాకపోవడంతో ప్రస్తుతం 45సంవత్సరాలకు పైబడిన వారికి వేస్తున్న రెండోడోసు టీకా ప్రక్రి యను సోమవారం కూడా నిలిపేస్తున్నట్టు ప్రకటించిన ఆరోగ్యశాఖ మళ్లీ వ్యాక్సినేషన్ను ఎప్పు డు ప్రారంభిస్తామనేది త్వరలో వెల్లడిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే శనివారం నుంచి టీకా వేసే కార్యక్రమం నిలిచిపోవడంతో రెండోడోసు కోసం ఇరుజిల్లాల్లో ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గతనెల 16, 17, 18తేదీల్లో 10వేలమందికి పైగా డోసులు వేశారు. వారందరికీ రెండోడోసు ఇవ్వాల్సి ఉండగా.. టీకాల నిలిపివేతతో వారంతా రెండోడోసు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొవిషీల్డ్ 3వేలు, కోవ్యాక్సిన్ 2500డోసులు స్టాకు ఉండగా.. టీకాల నిలిపివేతతో వాటిని కూడా వేయకుండా ఆపారు. అయితే మంత్రి పువ్వాడ అజయ్, కలెక్టర్ కర్ణన్ చొరవ తీసుకుని ప్రస్తుతం ఉన్న డోసుల వరకు అందిచేలా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.