టీకా రాజకీయం
ABN , First Publish Date - 2021-01-17T08:31:42+05:30 IST
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సీఎం కేసీఆర్ ఫొటోను మాత్రమే ఫ్లెక్సీల్లో
వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన
ఫ్లెక్సీల్లో మోదీ ఫొటో లేదని బీజేపీ అభ్యంతరం
పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకుల నిరసన
దేశాయిపేటలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సీఎం కేసీఆర్ ఫొటోను మాత్రమే ఫ్లెక్సీల్లో ముద్రించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. సీఎం, మంత్రుల ఫొటోలు పెట్టి ప్రధాని ఫొటో పెట్టకపోవడం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్ర ఉందన్నారు. అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోకి బీజేపీ నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కమలం కార్యకర్తలు ఫ్లెక్సీలను చించేశారు. వ్యాక్సిన్ సెంటర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దేశాయిపేట టీకా కేంద్రం వద్ద బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. పోచమ్మ మైదాన్, హసన్పర్తి, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రి, తిమ్మాపూర్ టీకా కేంద్రం ఎదుట కమలం కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ ఫోటో ఏర్పాటు చేయకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భువనగిరి జిల్లా ఆస్పత్రి ఆవరణలో ప్రధాని చిత్రపటానికి బీజేపీ కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. ఫ్లెక్సీల్లో కేవలం సీఎం ఫొటోను మాత్రమే ముద్రించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆసిఫాబాద్లో బీజేపీ నేతలు నిరసన తెలిపారు.