వ్యాక్సిన్ వెతలు
ABN , First Publish Date - 2021-05-07T09:44:53+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో.. అందరి చూపు టీకా వైపు మళ్లింది. వ్యాక్సిన్ తీసుకుంటే ముప్పు కొంత తప్పించుకునే అవకాశం ఉండటంతో
రోజుకు 200 డోసులు మాత్రమే
స్లాట్ బుక్ చేసుకున్నా దక్కని అవకాశం
హైదరాబాద్ సిటీ/అల్వాల్/ముషీరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో.. అందరి చూపు టీకా వైపు మళ్లింది. వ్యాక్సిన్ తీసుకుంటే ముప్పు కొంత తప్పించుకునే అవకాశం ఉండటంతో డిమాండ్ పెరిగింది. ఆన్లైన్లో నమోదు చేసుకున్నవారు ఉదయం నుంచే ఆస్పత్రుల ఎదుట బారులు తీరుతున్నారు. అయితే, నిల్వలు సరిపడా లేకపోవడంతో టీకా దొరకడం గగనమవుతోంది. దీంతో విసిగిపోయిన ప్రజలు వైద్యాధికారులతో గొడవకు దిగుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలు పంపిణీ కేంద్రాల వద్ద భౌతిక దూరం విస్మరిస్తున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ యూపీహెచ్సీలో టీకా కోసం వచ్చినవారు.. వైద్య సిబ్బందికి రోజూ గొడవలు తప్పడం లేదు. ఆస్పత్రి ఆవరణలోని రిజిస్ట్రేషన్ కౌంటర్ నుంచి టోకెన్లు దొరకనివారు వాగ్వాదానికి దిగుతున్నారు. గురువారం కొందరు నేరుగా వైద్యుడి గదిలోకి చొచ్చుకువెళ్లి సిబ్బందిని నిలదీశారు. ఇక స్లాట్ బుక్ చేసుకుని, రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద టోకెన్లు దొరకకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి.
- అల్వాల్ నవ కళా కేంద్రానికి నిత్యం వందలమంది టీకా కోసం వస్తున్నారు. కొంతమంది మాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ.. సిబ్బందిపై దాడులకు సైతం దిగుతున్నారు.
- జీహెచ్ఎంసీలో రోజుకు 200 మందికి మాత్రమే టీకా ఇస్తున్నారు. కొంతమంది వ్యాక్సిన్ దొరకదనే భయంతో ముందే వచ్చి వరుసలో ఉంటున్నారు.
- ఈ నెల 1 నుంచి 3 వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా పంపిణీ నిలిపివేశారు. కానీ, స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించారు. వీరితో పాటు, 3వ తేదీ అనంతరం బుక్ చేసుకున్నవారు కూడా ముషీరాబాద్ యూపీహెచ్సీకి వస్తున్నారు. అందరికీ అందకపోతుండటంతో గొడవ జరుగుతోంది.