పంజాబ్, ఢిల్లీల్లోనూ టీకాల కొరత
ABN , First Publish Date - 2021-04-11T06:58:01+05:30 IST
కరోనా వ్యాక్సిన్ నిల్వలు అయిపోతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన రాష్ట్రాల జాబితాలో పంజాబ్, ఢిల్లీ కూడా చేరాయి
రోజుల్లోనే స్టాక్ అయిపోతుందని సీఎంల ప్రకటన
మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్కు కోటి డోసులు
చండీగఢ్, ఏప్రిల్ 10 : కరోనా వ్యాక్సిన్ నిల్వలు అయిపోతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన రాష్ట్రాల జాబితాలో పంజాబ్, ఢిల్లీ కూడా చేరాయి. ప్రస్తుతం తమ వద్ద 5.7 లక్షల టీకా డోసులే ఉన్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వెల్లడించారు. ప్రతిరోజు సగటున 90వేల మందికి టీకాలు వేస్తున్నామని, ఈ లెక్కన ఐదురోజుల్లో టీకా నిల్వలన్నీ అయిపోతాయని స్పష్టంచేశారు. వచ్చే మూడు నెలల కాలంలో రాష్ట్రానికి సరఫరా చేయబోయే టీకా నిల్వలపై ముందస్తు షెడ్యూల్ను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈమేరకు ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాసినట్లు అమరీందర్ సింగ్ శనివారం తెలిపారు. ఇక తమ రాష్ట్రంలో వారం నుంచి పది రోజులకు సరిపడా టీకా నిల్వలే ఉన్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈనేపథ్యంలో తీవ్ర టీకాల కొరతను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లకు కోటి చొప్పున వ్యాక్సిన్ డోసులను పంపినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. మరో నాలుగు రోజుల్లో మహారాష్ట్రకు 1,121 వెంటిలేటర్లను కూడా అందిస్తామన్నారు.
పిల్లలకూ టీకా.. అనుమతించండి: ఫైజర్
న్యూయార్క్ : పన్నెండు నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకూ తమ కరోనా వ్యాక్సిన్ను అందించేందుకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)ను ఫైజర్ కంపెనీ కోరింది. ఇతర దేశాల్లోనూ దీనికి సంబంధించిన ప్రయత్నాలను ప్రారంభించినట్లు వెల్లడించింది.