ఆన్‎లైన్‎లో టీకా టోకెన్

ABN , First Publish Date - 2021-06-02T16:41:24+05:30 IST

సూపర్‌ స్ర్పెడర్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నేటి నుంచి మారనుంది. శానిటరీ సిబ్బందితో పాటు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లతో కూడిన బృందాలు వారి వద్దకే వెళ్లి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు

ఆన్‎లైన్‎లో టీకా టోకెన్

మొబైల్‌ యాప్‌ రూపకల్పన

ఫోన్‌ నెంబర్‌కు సందేశం

దాని ఆధారంగానే వ్యాక్సిన్‌

అవకతవకల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నిర్ణయం

దారి తప్పిన సూపర్‌ స్ర్పెడర్ల వ్యాక్సినేషన్‌

దిద్దుబాటు చర్యలకు శ్రీకారం


దారి తప్పిన వ్యాక్సినేషన్‌ను చక్కదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీకా టోకెన్ల జారీలో అవకతవకల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. టోకెన్లు నేరుగా పంపిణీ చేయకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ రూపొందించింది. నేటి నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్‌, గోషామహల్‌ సర్కిళ్ల పరిధిలో ప్రయోగాత్మకంగా మంగళవారం ఈ విధానం అమలు చేశారు. 


హైదరాబాద్‌ సిటీ: సూపర్‌ స్ర్పెడర్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నేటి నుంచి మారనుంది. శానిటరీ సిబ్బందితో పాటు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లతో కూడిన బృందాలు వారి వద్దకే వెళ్లి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తాయి. లబ్ధిదారుల పేరు, ఆధార్‌ నెంబర్‌, ట్రేడ్‌ వివరాలు, మొబైల్‌ నెంబర్‌తోపాటు ఫొటో తీసుకొని యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తాయి. లబ్ధిదారుల మొబైల్‌ నెంబర్‌కు రిజిస్ర్టేషన్‌ నెంబర్‌తో కూడిన సందేశం వెళ్తుంది. కేటాయించిన కేంద్రానికి వెళ్లి ఆ సందేశం అక్కడి సిబ్బందికి చూపిస్తే టీకా వేస్తారు. మెజార్టీ సర్కిళ్లలో అనర్హులకు టీకా టోకెన్లు అందుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 


తీరు మారకపోవడంతో

రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలోని వ్యాపారులు, కిరాణ దుకాణాల యజమానులు, సెలూన్లు, ఇస్ర్తీ దుకాణదారులు, వీధి వ్యాపారులు, చికెన్‌, మటన్‌, ఫిష్‌ విక్రయదారులు తదితర తొమ్మిది కేటగిరీల వారికి ఇప్పటి దాకా జీహెచ్‌ఎంసీ సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. వీరిలో మెజార్టీ కేటగిరీలకు చెందిన వారికి పనికి సంబంధించిన గుర్తింపు కార్డులు లేవు. ఆధార్‌ నెంబర్‌ తీసుకొని టోకెన్లు ఇచ్చారు. సాధారణ పౌరులూ ఆధార్‌ కార్డు వివరాలు ఇచ్చి టోకెన్లు తీసుకున్నారు. సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే‌ష్ కుమార్‌ తనిఖీ చేసిన నాంపల్లిలోని ఓ కేంద్రంలో అక్రమాలు వెలుగుచూశాయి. కుత్బుల్లాపుర్‌ సర్కిల్‌ పరిధిలో అనర్హులకు టోకెన్లు ఇచ్చినట్టు కమిషనర్‌ డీఎస్‌ లోకేష్ కుమార్‌ గుర్తించారు. ఈ రెండు ఘటనల్లోనూ సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేశారు. టోకెన్ల జారీ దారి తప్పితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించినా.. పరిస్థితి మారలేదు. క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకులు, అధికారుల జోక్యం పెరిగి టోకెన్లు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులకు వెళ్తున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ దిద్దుబాటు చర్యలకు  శ్రీకారం చుట్టింది. దీనిపై అవగాహన కల్పించేందుకు నేడు సర్కిల్‌ కార్యాలయాల్లో సిబ్బందితో అధికారులు సమావేశం కానున్నారు.  


ఫొటో తీసి అప్‌లోడ్‌

కుత్బుల్లాపూర్‌ : పలు సర్కిళ్లలో టోకెన్ల పంపిణీలో కొంత మంది అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. ఒక్కో టోకెన్‌ను రూ. 500 నుంచి రూ. 800కు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. దీనిపై పలువురు అధికారులకు, సిబ్బందికి మెమోలు కూడా జారీ అయ్యాయి. అవకతవకలకు అడ్డుకట్ట వేసి అర్హులకు మాత్రమే టీకాలు అందేలా ప్రభుత్వం టీఎస్‌ వ్యాక్సిన్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. గుర్తించిన సూపర్‌ స్ర్పెడర్‌ వివరాలతో పాటు వ్యాపారం లేదా దుకాణం ముందు నిల్చున్న ఫొటోను సిబ్బంది స్వయంగా తీసి యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం సదరు వ్యాపారికి టీకా వేయించుకోవల్సిన తేదీ, సమయంతో కూడిన మెసేజ్‌ వస్తుంది. కేంద్రానికి వెళ్లి అధికారులకు ఆ మెసేజ్‌ను చూపించి టీకా వేయించుకోవాలి. 


అప్‌లోడింగ్‌ మొదలైంది...

చాదర్‌ఘాట్‌  : సూపర్‌ స్ర్పెడర్స్‌కు వ్యాక్సిన్‌ఇచ్చేందుకు కూపన్ల  పంపిణీని ప్రభుత్వం నిలిపేసింది. ఆన్‌లైన్‌లో వివరాల నమోదుకు శ్రీకారం చుట్టింది. పలు శాఖలకు చెందిన ఓ బృందం నేరుగా వ్యాపారి దుకాణం వద్దకెళ్లి వివరాలు నమోదు చేసి, ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ జోనళ్లలో మంగళవారం నుంచి  అందుబాటులోకి వచ్చింది. 


రేపటి నుంచి ఆటో డ్రైవర్లకు వ్యాక్సిన్‌ : తలసాని

బేగంపేట: ఈ నెల 3వ తేదీ నుంచి ఆటో డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌తో కలిసి సనత్‌నగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

Updated Date - 2021-06-02T16:41:24+05:30 IST