టీకాకు పాకులాడొద్దు

ABN , First Publish Date - 2021-01-12T09:44:53+05:30 IST

తొలి విడత కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచితంగా టీకాలు వేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.

టీకాకు పాకులాడొద్దు

ప్రజాప్రతినిధులు తమ వంతు వచ్చేవరకు వేచి ఉండాల్సిందే

తొలి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకే ప్రాధాన్యం

3 కోట్ల మందికి టీకా ఉచితం

ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది

శాస్త్రీయ నిర్ధారణ తర్వాతే నిర్ణయం

రెండో విడతకల్లా మరిన్ని టీకాలు 

టీకా వదంతులపై ఉక్కుపాదం!

బర్డ్‌ ఫ్లూపై జాగ్రత్తతో వ్యవహరించండి

సీఎంలతో సమీక్షలో ప్రధాని వెల్లడి

రూ.210కే ఆక్స్‌ఫర్డ్‌ టీకా

కోటి పది లక్షల డోస్‌లకు కేంద్రం ఆర్డర్‌

‘సీరం’తో కొనుగోలు ఒప్పందం 

లోడ్‌తో బయల్దేరిన ఆరు ఏసీ ట్రక్కులు

కన్సైన్మెంటు కేంద్రం నుంచి రాష్ట్రాలకు

త్వరలో భారత్‌ బయోటెక్‌తోనూ డీల్‌?


న్యూఢిల్లీ, జనవరి 11 : తొలి విడత కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచితంగా టీకాలు వేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని వెల్లడించారు. వచ్చే కొన్ని నెలల్లో మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సన్నద్ధత, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంపై ప్రధాని మోదీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జనవరి 16 నుంచి భారత్‌ చేపట్టబోయే ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమంలో కరోనా యోధులకే అగ్రతాంబూలం దక్కుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు.


ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు, భద్రతా దళాలు, పోలీసులు, పారా మిలటరీ దళాలు, హోంగార్డులు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వలంటీర్లకు కూడా తొలి విడతలోనే టీకాలు వేస్తామని తెలిపారు. రెండో విడత టీకా కార్యక్రమం మొదలయ్యే సమయానికి మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తంచేశారు. టీకాల పనితీరుపై శాస్త్రీయ నిర్ధారణకు వచ్చిన తర్వాతే వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. టీకాలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై వదంతుల వ్యాప్తిని ఉక్కుపాదంతో అణచివేయాలని రాష్ట్రాలకు సూచించారు. వ్యాక్సినేషన్‌లో వారి వంతు వచ్చే వరకు ప్రజాప్రతినిధులు వేచి ఉండాల్సిందేనని, ముందస్తుగా వ్యాక్సిన్‌ కోసం పాకులాడొద్దని హితవు పలికారు. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో పౌలీ్ట్ర ఫామ్‌లు, జూలు, జల వనరులను నిరంతరం పర్యవేక్షించాలని, అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. 3 కోట్ల మందికే ఉచిత టీకాలిస్తే.. మిగిలిన జనాభాకు వ్యాక్సిన్స్‌ అందించే బాధ్యత కేంద్రానిదా? రాష్ట్రాలదా ? అని ప్రధానిని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. టీకా లభ్యతపైౖ మరోమారు మాట్లాడదామని ప్రధాని బదులిచ్చినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-01-12T09:44:53+05:30 IST