వదలని వరద

ABN , First Publish Date - 2020-10-30T04:12:48+05:30 IST

ఒక్కరోజు వర్షానికి వరద పోటెత్తి ఆకివీడు మండలం అతలాకుతలమైంది. ఈనెల 9న మండలంలో 21.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. తమ్మిలేరు, బుడమేరు, ఎర్రకాలువలకు వరద నీరు పోటెత్తడంతో 13గ్రామాలు నీట మునిగాయి.

వదలని వరద
కొత్త చెరువులో రంగు మారిన మంచినీటి చెరువు

5275 ఎకరాల వరికి నష్టం

7వేల ఇళ్లు మునక 

500 ఎకరాల ఆక్వా చెరువులకు నష్టం

ఆకివీడు రూరల్‌ ఒక్కరోజు వర్షానికి వరద పోటెత్తి ఆకివీడు మండలం అతలాకుతలమైంది. ఈనెల 9న మండలంలో 21.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. తమ్మిలేరు, బుడమేరు, ఎర్రకాలువలకు వరద నీరు పోటెత్తడంతో 13గ్రామాలు నీట మునిగాయి. కొల్లేరు నీటిని సముద్రంలోనికి తీసుకెళ్లే ఉప్పుటేరు ఆకివీడు సమీపం నుంచి ప్రవహిస్తుండడం, అయిశ, చినకాపవరం మురుగు డ్రెయిన్లు కూడా ఎగదన్నడంతో వరద తీవ్రత పెరిగింది. మండలంలో పలు గ్రామాలను నేటికీ వరద వదల్లేదు.


మండలంలోని చాలా గ్రామాలు ఇంకా ముంపు నీటిలోనే ఉన్నాయి. వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికి గుమ్ములూరు, అప్పారావుపేట, ఆకివీడు, చినకాపవరం, సిద్దాపురం, కళింగపాలెం గ్రామాలు వరద నీటి లోనే ఉన్నాయి. ఆకివీడు–చినిమిల్లిపాడు రహదారిలో ఫారెస్టు చెక్‌పోస్టు, సిద్ధాపురం వద్ద రోడ్డుపై రెండగులు మేర నీరు ప్రవహిస్తోంది. కొత్త చెరువు, గుమ్ములూరు గ్రామాలలో మంచినీటి చెరువులు వరద నీటితో రంగు మారి దుర్వాసన వస్తోంది. ఆ నీటినే శుద్ధిచేసి కుళాయిలు ద్వారా పంపిణీ చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పాతవయ్యేరు కాలువ నీరు నల్లరంగులోనికి మారి దుర్వాసన వెదజల్లుతోంది.


వరద తాకిడితో మండలంలో 5275 ఎకరాలలో వరి చేలకు నష్టం వాటి ల్లింది. మండలంలో 6935 ఎకరాల్లో సాగు చేపట్టగా 1660 ఎకరాలు మాత్ర మే ముంపు ముప్పు లేకుండా ఉంది. మిగిలిన చేలన్నీ ఇప్పటికీ చెరువులను తలపిస్తున్నాయి. సుమారు 15 రోజులు పాటు నీటిలో నానిపోవడంతో వరి పైరు కుళ్ళిపోయి నీరు రంగు మారి దుర్వాసన వస్తోంది. పొట్ట దశ, పాలు పోసుకునే దశలో వరద రైతులను కోలుకోని దెబ్బకొట్టింది. ఎకరాకు రూ. 25వేలు వరకు పెట్టుబడి పెట్టారు, రెండు సార్లు నారుమడి సమయంలో వర్షాలకు మునిగిపోయి నష్టపోయారు. మూడోసారి పంట పొట్ట, పాలు పోసుకునేదశలో వరద ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయారు.


సుమారు 500 ఎకరాలలో చేపల, రొయ్యల చెరువులు వరద నీటిలో మునిగాయి. మరో 300 ఎకరాల అనధికార చెరువులు కూడా మునిగాయి. రైతులు వలలు, ఆపాలు కట్టినా చేపలు వరద నీటికి కొట్టుకుపోయాయి. చెరువులలో నీరు రంగు మారుతున్న తరుణంలో చేపలు బతికుంటాయనేది అనుమానమే. వలలు, కర్రలకు కూలీలకు అదనంగా ఎకరాకు రూ. 50వేలు ఖర్చయింది. ప్రభుత్వ సాయం కోసం ఆక్వా రైతులు ఎదురు చూస్తున్నారు.


మండలంలోని 15 గ్రామాల్లో సుమారు 7 వేల ఇళ్లు నీట మునిగాయని అధికారులు అంచనా వేశారు. ఆకివీడు, గుమ్ములూరు, తరటావ, అప్పారావు పేట, చినకాపవరం, పెదకాపవరం, కోళ్ళపర్రు, రాజులపేట, చినిమిల్లిపాడు, కళింగపాలెం, సిద్ధాపురం, దుంపగడప, మందపాడు, అయిభీమవరం, చెరు కుమిల్లి గ్రామాలలో ఇళ్లు నీట మునిగాయి. బాధిత కుటుంబాల్లో సుమారు 7వేల మందికి బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు.



Updated Date - 2020-10-30T04:12:48+05:30 IST