ముఖం చాటేసిన వరుణుడు
ABN , First Publish Date - 2021-06-23T06:36:07+05:30 IST
వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ దేవరకొండ డివిజన్లో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆందోళనలో రైతులు
దేవరకొండ, జూన్ 22: వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ దేవరకొండ డివిజన్లో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మృగశిరకార్తె కంటే ముందు కురిసిన వర్షాలకు డివిజన్ పరిధిలోని మండలాల్లో 15వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. విత్తనాలు మొలకలు వస్తున్నప్పటికీ వర్షం కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొంతమంది రైతులు పత్తి మొక్కలు ఎండిపోకుండా బోరుబావుల వద్ద నుంచి పైప్లైన్లు వేసి మొక్కలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. డివిజన్ పరిధిలో ఈ సంవత్సరం 2లక్షల 30వేల ఎకరాల్లో పత్తిపంట సాగుచేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. దుక్కులు దున్ని విత్తనాలు సిద్ధం చేసుకుని వర్షం కోసం మరికొంతమంది రైతులు ఎదురుచూస్తున్నారు. మృగశిరకార్తె కంటే ముందే దేవరకొండ డివిజన్లో రెండుసార్లు వర్షాలు కురవడంతో కొంతమంది రైతులు 15వేల ఎకరాల వరకు పత్తివిత్తనాలు వేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు. వేసినపత్తి మొలకలు వస్తోంది. కాని ఈనెల 8న మృగశిర ప్రారంభం నుంచి వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడులుపెట్టి విత్తనాలు వేశామని, వర్షాలు కురవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఆకాశం మేఘావృతం అవుతున్నప్పటికీ వర్షాలు కురవడంలేదు. వర్షాలు సంవృద్ధిగా కురిస్తే రైతులు పంటలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని దేవరకొండ డివిజన్ వ్యవసాయశాఖ అధికారి తిప్పర్తి విజేందర్రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం 30వేల ఎకరాలు అదనంగా పత్తిని సాగుచేసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.