ఆపన్నులకు అండగా..
ABN , First Publish Date - 2020-04-05T10:26:35+05:30 IST
నగర పంచాయతీ పరిధిలోని వస్త్రపురికాలనీలోని నిరుపేద కుటుంబాలకు కళ్యాణగౌరీ మల్లిఖార్జున దేవాంగ సంక్షేమ సంఘం చేయూతనందించింది.
లాక్డౌన్ నేపథ్యంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్నవారికి మేమున్నాం.. మీ ఆకలి తీరుస్తామంటూ పలువురు దాతలు అండగా నిలుస్తున్నారు. నిరుపేదలకు, అన్నార్తులకు నిత్యావసర సరుకులు, ఆహారపొట్లాలు అందజేసి ఉదారత చాటుకుంటున్నారు.
రాజాం/రూరల్, ఏప్రిల్ 4: నగర పంచాయతీ పరిధిలోని వస్త్రపురికాలనీలోని నిరుపేద కుటుంబాలకు కళ్యాణగౌరీ మల్లిఖార్జున దేవాంగ సంక్షేమ సంఘం చేయూతనందించింది. ఆయా కుటుంబాలకు శనివారం పది కిలోల బియ్యం, లీటర్ ఆయిల్, కిలో చింతపండు, కిలో ఉల్లి, కూరగాయలు, నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు శ్రీను, కలంబరి, సోమశేఖర్, మున్నా, చప్పటి పెంటయ్య, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే అమ్మవారికాలనీలోని సత్యసాయి సేవాసంస్థ 10 వేల మాస్కులు పారిశుధ్య సిబ్బంది, వివిధ ఉద్యోగులకు అందజేశారు. కలెక్టర్ కార్యాలయానికి 2500 మాస్కులు అందజేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
పాలకొండ రూరల్ : నగరపంచాయతీ 6వ వార్డు ఇందిరానగర్కాలనీలో శనివారం పల్లా కొండలరావు, అడపా బాబ్జీనాయుడుల ఆధ్వర్యంలో స్థానికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే దుగ్గి గ్రామంలో శనివారం మాజీ సర్పంచ్ మజ్జి వెంకటమ్మ ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అలుగుబిల్లి మన్మధరావు, మజ్జి అశోక్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎస్టీ పోస్టుమెట్రిక్ వసతిగృహంలో ఉన్న వలస కూలీలకు మిల్క్హిల్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో ఆర్డీవో టీవీఎస్జీ కుమార్, కమిషనర్ ఈ.లిల్లీపుష్పనాధంల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జె.రామారావు, మిల్క్హిల్ గ్రూప్ సభ్యులు రాజశేఖర్, పట్నాన రాము తదితరులు పాల్గొన్నారు.
రేగిడి: కొండవలస మాజీ సర్పంచ్ తుమ్మి వెంకటరమణ 400 కుటుంబాలకు 6 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే సోమరాజుపేటలో యూత్ నాయకులు సవలాపురపు రమేష్నాయుడు, మరి కొంతమంది సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విశాఖపట్నం దక్షిణమధ్య రైల్వే మేనేజర్ నవీన్మాల్యా సమకూర్చిన సరుకులను కందిశలో అనాథలకు వావిలవలసకు చెందిన సామాజిక కార్యకర్త పాలూరి సిద్దార్ధ అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్ మాస్టర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
చిన్నయ్యపేట(లావేరు) : 300 మంది నిరాశ్రయులకు చిన్నయ్య పేటకు చెందిన యువత గ్రామస్థుల సహకారంతో భోజన ఏర్పాట్లు చేశారు. ఆహార పొట్లాలను శ్రీకాకుళం రిమ్స్, చిలకపాలెం, అరసవల్లి, ఏడు రోడ్లు, ఓబీఎస్, డేఆండ్నైట్, రాగోలు జంక్షన్ లో అన్నార్తులకు అందజేశారు. పట్నవానిపేటకు చెందిన కాగితాల వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి పట్నవానిపేట, దేశపాలేం గ్రామాలకు చెందిన 320 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వితరణ
ఎచ్చెర్ల : కుశాలపురానికి చెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం.వి.ఆర్.మూర్తి ఎచ్చెర్ల, లావేరు మండలాల్లోని 235 ఎస్సీ కుటుంబాలకు శనివారం వితరణ చేశారు. ఎస్ఎంపురం పంచాయతీలో 95, జరజాంలో 90, లావేరు మండల పరిధి లోపెంటలో 50 కుటుంబాలకు 5 కిలోల చొప్పు న బియ్యం, అర కిలో కందిపప్పు, కూరగాయలు అందజేశారు. కార్యక్రమం లో జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, ఎస్ఎన్పీఎస్ రాష్ట్ర అఽధ్యక్షుడు కళ్లేపల్లి రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అజ్జరాంలో మాజీ సర్పంచ్ బోర శ్రీనివాసరావు, అరిణాం అక్కివలస పంచాయతీ పరిధి బారికిపేట, శేషపేటలోని ఎస్సీలకు యువజన సంఘం ప్రతినిధులు కూరగాయలు అందజేశారు. కార్యక్రమంలో కొయ్య శ్రీనివాసరెడ్డి, బోర రాము, దారపు రమణారెడ్డి, పుణ్యపు శంకరరావు, దనాలకోటి రమణ, సుత్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జి.సిగడాం: దవళపేటకు చెందిన బొడ్డేపల్లి ఉదయ్కుమార్, పేడాడ నారాయణరావు దవళపేట, విజయరాంపురంలో 450 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పేడాడ శ్రీరామ్, బొడ్డేపల్లి ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.