పెట్రో ధరలపై వ్యాట్ తగ్గించాలి
ABN , First Publish Date - 2021-12-06T05:31:45+05:30 IST
పెట్రో ధరలపై వ్యాట్ తగ్గించాలి
వికారాబాద్ : కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వ్యాట్ని కూడా తగ్గించకుండా చోద్యం చూస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్కుమార్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జటావత్ హుస్సేన్నాయక్ ఆదేశాల మేరకు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్ అధ్యక్షతన ఆదివారం పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, గిరిజన మోర్చా జిల్లా ఇన్చార్జి ప్రశాంత్లు హాజరై మాట్లాడుతూ, బీజేపీ పాలిత రాష్ట్రాలలో కేంద్రం తగ్గించినా బాటలోనే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ను తగ్గించి ప్రజలకు కొంత ఊరట కల్పిస్తుంటే, తెలంగాణలో మాత్రం తగ్గించకపోవడం సిగ్గుచేటు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం ప్రతిపాదన తెస్తే దానిని ముందు వ్యతిరేకించిన పార్టీ టీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. కేవలం హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వరి కొనుగోలు అనే కొత్త నాటకం కేసీఆర్ ఆడుతున్నారని అన్నారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల నిరసనకు కేంద్రం బదులిస్తూ, గతంలో కొన్న ధాన్యంనే కేంద్రానికి అప్పగించలేదని తెలిపిందన్నారు. ఇప్పటికైనా పెట్రో ధరలపై వ్యాట్ను తగ్గించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు పాండుగౌడ్, రమేష్, ఉపాధ్యక్షులు రాఘవనాయక్, కార్యదర్శి శ్రీకాంత్, మోర్చా అధ్యక్షులు నవీన్, మహిపాల్రెడ్డి, జిల్లా గిరిజన మోర్చా నాయకులు రాంజీ రాథోడ్, గోపాల్నాయక్, చందర్, మండల ఇన్చార్జిలు భరత్గౌడ్, శ్రీధర్రెడ్డి, మండలాధ్యక్షుడు కృష్ణయాదవ్, జిల్లా నాయకులు జగదీష్. తదితరులు పాల్గొన్నారు.