మార్కెట్‌కు భారీగా తరలి వస్తున్న కూరగాయలు

ABN , First Publish Date - 2021-08-10T22:39:23+05:30 IST

తెలంగాణలో గత కొంత కాలంగా భారీగా కూరగాయల దిగుబడి పెరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని దాదాపు అన్నిజిల్లాల్లో కూరగాయల పంటలు బాగా పెరిగినట్టు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు.

మార్కెట్‌కు భారీగా తరలి వస్తున్న కూరగాయలు

హైదరాబాద్‌: తెలంగాణలో గత కొంత కాలంగా భారీగా కూరగాయల దిగుబడి పెరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని దాదాపు అన్నిజిల్లాల్లో కూరగాయల పంటలు బాగా పెరిగినట్టు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. గత మూడు నెలలతో పోలిస్తే ప్రస్తుతం కూరగాయల ధరలు బాగా తగ్గాయి. దీంతో సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. మటన్‌, చికెన్‌ వంటి నాన్‌వెజ్‌ ధరలు భారీగా పెరిగిన నేపధ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు కూరగాయల పై దృష్టిపెట్టారు. తెలంగాణలోని మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, నల్గొండ తదితర జిల్లాల్లో కూరగాయల పంట భారీగా వస్తున్నట్టు అధికారులు తెలిపారు. 


ప్రత్యేకించి రెండునెలల క్రితం కిలో 100 నుంచి 120 రూపాయలు పలికిన బిన్నీసు ధర ప్రస్తుతం కిలో 60 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగే గోకర కాయ ధర కిలో 40 నుంచి 50 రూపాయలు, టమాటా కిలో 15 నుంచి 25 రూపాయలకు దొరుకుతోంది. చిక్కుడు కాయ కూడా కిలో 50 నుంచి 60రూపాయలు, బుడమకాయలు కిలో 20రూపాయలు, ఆలుగడ్డ 20 రూపాయలు, దొండకాయ 20 రూపాయలు, బెండకాయ 30 నుంచి 40 రూపాయలకు లభిస్తున్నాయి. కేవలం తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌ , కర్ణాటక రాష్ర్టాల నుంచి కూడా హైదరాబాద్‌ మార్కెట్‌లకు భారీగా కూరగాయల దిగుమతి పెరిగింది. అయితే ఆషాఢ మాసం వెళ్లి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో చాలా మంది విజిటేరియన్‌ వైపే మొగ్గుచూపిస్తుంటారు. దీంతో ఽమరికొద్ది రోజుల్లో ధరల్లో తేడా వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. 

Updated Date - 2021-08-10T22:39:23+05:30 IST