కూర‘గాయాలే’!

ABN , First Publish Date - 2020-10-19T09:15:38+05:30 IST

కూరగాయలతో పాటు ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. భారీవర్షాలు, వరదలతో తోటలు దెబ్బతినడంతో కూరగాయల

కూర‘గాయాలే’!

వరదలతో పాడైన పంటలు..

కంట తడి పెట్టిస్తున్న ఉల్లి

గూడెం మార్కెట్‌లో కిలో రూ.85

త్వరలో 100కు చేరే అవకాశం 

వినియోగదారులకు ధరల మంట 


అమరావతి/తాడేపల్లిగూడెం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): కూరగాయలతో పాటు ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. భారీవర్షాలు, వరదలతో తోటలు దెబ్బతినడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గింది. ఈ నెల మొదటివారంలో ధరలు కాస్త తగ్గుముఖం పట్టగా వరద ప్రభావంతో రవాణా లేక ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వాయుగుండంతో భారీవర్షాలు కురిసి, తోటల్లో పూత, కాయ నేలరాలిపోయింది. లంక గ్రామాల్లో కూరగాయ తోటలను వరద నీరు ముంచెత్తింది. వాగులు పొంగి, రోడ్లు పాడై, రవాణా సరిగ్గా లేక రైతులు సరుకు మార్కెట్‌కు తరలించలేకపోతున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో టమాటా పంట కొంత పాడైందని చెబుతున్నారు. కోస్తాజిల్లాల్లోని లంకలు, లోతట్టు ప్రాంతాల్లో అరటి, కంద, ఉల్లి, దోస, నేల చిక్కుడు, ఆకు కూరకూరల పంటలు నీట మునిగాయి.


బెండ, దొండ, కాకర తోటలు పాక్షికంగా దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గింది. కర్ణాటక నుంచి వచ్చే క్యారెట్‌, క్యాప్సికం  మహారాష్ట్ర నుంచి వచ్చే బంగాళాదుంప కూడా ధర తగ్గడం లేదు. క్యారెట్‌, చిక్కుడు కిలో రూ.100 పలుకుతుండగా, ఇతర కూరగాయలన్నీ రూ.40కి పైనే పలుకుతున్నాయి. రైతుబజార్లలో ధరలు కాస్త అటూఇటుగా ఉంటున్నా, వర్షాలకు నాణ్యమైన సరుకు రావడం లేదు. మరోవైపు దసరా సమయంలో ఉభయగోదావరి జిల్లాల్లో మాంసం వినియోగం తక్కువ. కూరగాయల వినియోగం ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. 


ఘాటెక్కిన ఉల్లి 

పెరిగిన ఉల్లి ధరలతో జనం అల్లాడుతున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌లో రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.85 అమ్మకాలు సాగిస్తున్నారు. త్వరలోనే రూ.100కు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిక వర్షాలతో ఉల్లి దిగుబడులు తగ్గిపోయాయి. ప్రఽస్తుతం కర్నూలు ఉల్లి సీజన్‌ నడుస్తున్నా మార్కెట్‌కు మాత్రం దిగుమతి అంతంతమాత్రంగానే ఉంది. అది కూడా స్థానిక అవసరాలకే వినియోగిస్తున్నారు. ఎగుమతులకు పనికి రావట్లేదు. వర్షాలతో ఉల్లి కుళ్లిపోతోంది. దిగుబడులు దారుణంగా పడిపోయాయి. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. మహరాష్ట్రలో ఉత్పత్తి అయిన ఉల్లి నిల్వ ఉంటుంది. అదే ఇప్పుడు మార్కెట్‌లో అమ్మకాలు సాగిస్తున్నారు. మహరాష్ట్రలోనే కిలో రూ.60లు పలుకుతోంది. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రావడానికి రవాణా చార్జీలు, హోల్‌సేల్‌ వర్తకుల నుంచి రిటైల్‌కు చేరుకునేసరికి కిలో రూ.85కు చేరుతోంది.


కొత్త పంట వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జనవరిలో మహారాష్ట్రలో కొత్త పంట వస్తుంది. అప్పడు ధర తగ్గే అవకాశం ఉంటుందని ఉల్లి వ్యాపారి నంద్యాల కృష్ణమూర్తి తెలిపారు. దేశీయంగా ధరలు పెరుగుతుండడంతో విదేశాలకు ఉల్లి ఎగుమతులు నిలిపివేశారు. గతంలో ఉల్లి ధరలు పెరిగితే ప్రభుత్వం జోక్యం చేసుకొని తక్కువ ధరలకు అమ్మకాలు సాగించేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గంట గంటకు ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. 

Updated Date - 2020-10-19T09:15:38+05:30 IST