వాహనానికి వారసత్వం... తుది నోటిఫికేషన్ జారీ

ABN , First Publish Date - 2021-05-03T20:29:55+05:30 IST

మోటారు వాహన నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో... వాహన కొనుగోలు సమయంలోనే... ఆ వాహనానికి సంబంధించి వారసుడిని ఏర్పాటు చేసుకోవచ్చు.

వాహనానికి వారసత్వం... తుది నోటిఫికేషన్ జారీ

న్యూఢిల్లీ : మోటారు వాహన నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.  ఈ నేపధ్యంలో... వాహన కొనుగోలు సమయంలోనే... ఆ వాహనానికి సంబంధించి వారసుడిని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే... దురదృష్టవశాత్తూ వాహన యజమాని మరణించినపక్షంలో... నామినీ పేరిట వాహనాన్ని బదిలీ చేయించుకోవడం వారసునికి సులభతరమవుతుంది. కొత్త నిబంధనలకు సంబంధించి మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యింది. నోటిఫికేషన్ లోని వివరాలిలా ఉన్నాయి.


కొత్త నిబంధనల నేపధ్యంలో... వాహనం రిజిస్ట్రేషన్ తర్వాత వాహన యజమాని ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా నామినీని నియమించవచ్చు. ఇప్పటివరకు నామినీని నియమించడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి గురించి తెలిసిందే. ఈ క్రమంలో... దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి రానుంది. 


కొత్త నిబంధనల ప్రకారం... వాహన యజమాని నామినీని నియమించే సందర్భంలో... నామినీ  గుర్తింపు కార్డును కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరికొన్ని వివరాలిలీ... నోటిఫికేషన్ ప్రకారం, వాహన యజమాని మరణించిన 30 రోజుల్లోపు మరణాన్ని రిజిస్ట్రేషన్ అథారిటీకి నివేదించాల్సి ఉంటుంది. వాహన యజమాని మరణించిన మూడు నెలల్లో నామినీ వాహన బదిలీ కోసం ఫారం -31 ను అందించాలి. ఈ కాలంలో, నామినీ వాహనాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.


నామినీని మార్చుకునే వెసులుబాటు... కొత్త నిబంధనల ప్రకారం, వాహన యజమాని ఎప్పుడైనా నామినీని మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం... విడాకులు లేదా విడిపోయిన సందర్భంలో, వాహన యజమాని తన నామినీని మార్చవచ్చు. ఇది అంగీకరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) కింద వర్తించాలి. ఈ మార్పు తరువాత... దేశవ్యాప్తంగా వాహనాల బదిలీలో ఒకే రకమైన ఏర్పాటు ఉంటుంది. ఇందుకు సంబంధించిన తుది నోటిఫికేషన్ జారీ అయ్యింది. 

Updated Date - 2021-05-03T20:29:55+05:30 IST