బీఆర్‌ఏయూ వీసీగా వెంకటరావు

ABN , First Publish Date - 2021-01-21T06:19:58+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా నిమ్మ వెంకటరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన సతీసమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఎచ్చెర్లలోని వర్సిటీకి చేరుకొని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బీఆర్‌ఏయూ వీసీగా వెంకటరావు
బాధ్యతలు స్వీకరిస్తున్న వీసీ ప్రొఫెసర్‌ వెంకటరావు

నూతనంగా బాధ్యతల స్వీకరణ

ఎచ్చెర్ల(శ్రీకాకుళం), జనవరి 20: 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా నిమ్మ వెంకటరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన సతీసమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఎచ్చెర్లలోని వర్సిటీకి చేరుకొని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత తన చాంబర్‌కు వెళ్లి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.రఘుబాబు, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్‌ టి.కామరాజు, ప్రొఫెసర్‌ పి.సుజాత, సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, పూర్వపు వీసీ ప్రొఫెసర్‌ హనుమంతు లజపతిరాయ్‌, విశ్రాంత ప్రొఫెసర్‌ పి.చిరంజీవులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

కుప్పిలి నుంచి ప్రస్థానం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన కన్నమ్మ, రామస్వామిరెడ్డిలకు నిమ్మ వెంకటరావు జన్మించారు. స్వగ్రామమైన కుప్పిలిలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. మురపాక హైస్కూల్‌లో 8,9,10, పొందూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం డిగ్రీ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ ఎడ్యుకేషన్‌, ఎంఏ ఫిలాసఫీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. వెంకటరావు భార్య విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.  వీరి ఇద్దరు కుమారులు ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. 

మెరుగైన బోధనకు కృషి

వర్సిటీ పరిధిలో మెరుగైన బోధన అందించేందుకు కృషి చేయనున్నట్లు నూతన వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలిపారు. వీసీగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బోధనలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్సిటీలో అవసరమైన కొత్త కోర్సులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కోర్సులను బలోపేతం చేసి, విద్యార్థులను ఆకర్షించేలా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. వర్సిటీలోని బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ వర్సిటీ జర్నల్‌ను వీసీ ఆవిష్కరించారు. 


Updated Date - 2021-01-21T06:19:58+05:30 IST