35 రోజుల పాటు వెంటిలేటర్ చికిత్సతో...
ABN , First Publish Date - 2021-05-26T09:30:27+05:30 IST
కొవిడ్ ఇన్ఫెక్షన్తో వెంటిలేటర్ మీదకు వెళ్లిన వారి ఆరోగ్యం తిరిగి పుంజుకునే సందర్భాలు తక్కువే! అలాంటిది ఏకంగా 35 రోజుల పాటు వెంటిలేటర్ చికిత్స తీసుకుని కొవిడ్తో పోరాడి గెలిచిందో మహిళ. దిల్లీ వాలీ మీనూగా పేరు పొందిన ఆ ధైర్యశాలి కథ
కొవిడ్ ఇన్ఫెక్షన్తో వెంటిలేటర్ మీదకు వెళ్లిన వారి ఆరోగ్యం తిరిగి పుంజుకునే సందర్భాలు తక్కువే! అలాంటిది ఏకంగా 35 రోజుల పాటు వెంటిలేటర్ చికిత్స తీసుకుని కొవిడ్తో పోరాడి గెలిచిందో మహిళ. దిల్లీ వాలీ మీనూగా పేరు పొందిన ఆ ధైర్యశాలి కథ ఇది!
ఢిల్లీకి చెందిన మీనూ చౌహాన్ ఓ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. ఏప్రిల్ ఒకటిన కురుక్షేత్రలోని పుట్టింట్లో వదిలిన కూతురును తిరిగి ఢిల్లీకి తీసుకురావడం కోసం వెళ్లిన మీనూ అక్కడ కొవిడ్ బారిన పడింది. ఏప్రిల్ 3న కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన మీనూ పరిస్థితి క్రమేపీ దిగజారింది. ఆమె రెండు ఊపిరితిత్తులకూ ఇన్ఫెక్షన్ వ్యాపించి, ఆక్సిజన్ శాచురేషన్ 70 కంటే దిగువకు పడిపోయింది. దాంతో కురుక్షేత్రలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. అక్కడ ఆక్సిజన్ థెరపీ ఇచ్చినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగు పడలేదు. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఆమెను ఐసియుకు తరలించి, వెంటిలేటర్ అమర్చారు. అలా మీనూ వెంటిలేటర్ సహాయంతో 35 రోజుల పాటు కొవిడ్తో పోరాడింది. తన అనుభవం గురించి వివరిస్తూ... ‘‘అది చాలా క్లిష్ట సమయం. వైద్యులు నన్ను ఐసియుకు షిఫ్ట్ చేసినప్పుడు చాలా భయపడ్డాను. కొవిడ్ నుంచి కోలుకుని, తిరిగి నా కుటుంబాన్ని చూడగలుగుతానని అనుకోలేదు. అయితే ఐసియులో నాకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు నెల రోజుల పాటు కొవిడ్ అనే రహస్య శత్రువుతో పోరాడే ధైర్యాన్ని నాకందించారు.’’ అని చెప్పుకొచ్చింది మీనూ.
మనోధైర్యమే ఆమెను కాపాడింది!
‘‘మీనూ చాలా ధైర్యవంతురాలు. ఆవిడ మనోధైర్యం, పట్టుదలనూ చూసి, మా స్టాఫ్ మెంబర్లందరూ ఎంతో అబ్బురపడ్డారు. మనో ధైర్యం తోడుంటే, కొవిడ్ నుంచి కోలుకోవడం కష్టమేమీ కాదు అనడానికి మీనూనే ఓ ఉదాహరణ.’’ అని చెప్పుకొచ్చారు మీనూకు చికిత్స అందించిన డాక్టర్ అనురాగ్ కౌశల్!