మత సామరస్యానికి ప్రతీక చాపకూడు
ABN , First Publish Date - 2021-12-06T05:50:11+05:30 IST
పల్నాడు వీరారాధన ఉత్సవాల్లో మత సామరస్యానికి ప్రతీకగా చాపకూడు నిలిచిందని జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా అన్నారు.
కారంపూడి, డిసెంబరు5: పల్నాడు వీరారాధన ఉత్సవాల్లో మత సామరస్యానికి ప్రతీకగా చాపకూడు నిలిచిందని జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా అన్నారు. ఆదివారం మందపోరులో భాగంగా వీర్ల దేవాలయ ప్రాంగణంలో ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే పీఆర్కేతో కలిసి చాపకూడు ప్రారంభించారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవారు మాట్లాడుతూ నాడు బ్రహ్మనాయుడు దళితులకు చెన్నకేశవస్వామి ఆలయ ప్రవేశం కల్పించి అన్నిమతాల వారితో చాపకూడు సహపంక్తి భోజనాలు ప్రవేశపెట్టారని, అదేరీతిలో వీర్ల దేవాలయ ప్రాంగణంలో చాపకూడు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్, జడ్పీటీసీ షేక్ షఫి, ఎంపీపీ మేకల శారదా శ్రీనివాసరెడ్డి, ఉప ఎంపీపీ అనంతలక్ష్మి, ఎంపీడీవో బాలునాయక్, దుర్గి మార్కెట్యార్డు డైరెక్టర్ గుండా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ముచ్చటగా మందపోరు
పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో మూడోరోజు మందపోరును పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ వైభవంగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కొణతాలను గంగధార మడుగులో స్నానమాచరింపజేసి, అలంకరించి వీర్ల దేవాలయంలో పూజలు జరిపారు. బ్రహ్మనాయుడు విగ్రహం, పీఠాధిపతి నివాసం వద్ద కత్తిసేవ చేశారు. అనంతరం వీర్ల దేవాలయంలో కంకణదారుడైన పీఠాఽధిపతి ముందు మందపోరు కథను వీరవిద్యావంతులు గానం చేశారు.