విగ్రహం ఏర్పాటు చాలా సంతోషం: అనితా బోస్
ABN , First Publish Date - 2022-01-22T02:05:24+05:30 IST
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్..
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ గౌరవార్ధం ఆయన విగ్రహాన్ని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంతోషం వ్యక్తం చేశారు. ''చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది యువతకు ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ గురించి బాగా తెలుసు. ఆయనను ఎలా గౌరవించాలో కూడా తెలుసు. వారందరికీ కృతజ్ఞతలు. దేశం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సుభాష్ చంద్రబోస్కు ఇండియా గేట్ వంటి ప్రముఖమైన చోట విగ్రహం ఏర్పాటు చేయడం ఘన నివాళి అవుతుంది'' అని అనితా సుభాష్ ఓ ట్వీట్లో తన సంతోషాన్ని పంచుకున్నారు.నేతాజీ పాటించిన విలువలు, సిద్ధాంతాలను పునరుద్ధరించి, పటిష్టం చేయడం అన్నిటికంటే ముఖ్యమని అన్నారు. ఉన్నత స్థాయి రాజకీయ నేతలే కాకుండా ప్రతి ఒక్క యువతీయువకుడు బోస్ ఆశయాల కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు.
కాగా, నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకుంటున్న వేళ గ్రానైట్తో తయారు చేసిన ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అందరితో పంచుకుంటుండటం తనకు సంతోషంగా ఉందని ప్రధాని మోదీ బుధవారంనాడు ఒక ట్వీట్లో తెలిపారు. ఆయన పట్ల మనకున్న కృతజ్ఞతాభావానికి, రుణం తీర్చుకోవడానికి ఇదొక ప్రతీక అని తెలిపారు. దివ్యమైన నేతాజీ విగ్రహం తయారీ పూర్తయ్యే వరకు ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తానని తెలిపారు.