పశు వైద్యం.. మరింత దూరం!

ABN , First Publish Date - 2021-08-24T05:44:52+05:30 IST

పశు వైద్యశాలల కుదింపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వ్యవసాయం తరువాత కోళ్లు, పశుపోషణకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటుకాని ప్రస్తుత పరిస్థితుల్లో గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకం, పశుపోషణ.. రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. కాగా, పశువులు అనారోగ్యం బారిన పడినప్పుడు సేవలందించేందుకు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరతను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం తాజాగా.. ఉన్న పశు వైద్యశాలలను హేతుబద్ధీకరించి వాటి సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది.

పశు వైద్యం.. మరింత దూరం!
ఈదుపురంలోని పశువైద్య కేంద్రం

- వైద్యశాలల కుదింపునకు సన్నాహాలు! 

- మండలానికి ఇక రెండు మాత్రమే

- ప్రభుత్వానికి నివేదికలు పంపిన అధికారులు

- ఆందోళన చెందుతున్న రైతులు

(ఇచ్ఛాపురం/రూరల్‌) 

పశు వైద్యశాలల కుదింపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వ్యవసాయం తరువాత కోళ్లు, పశుపోషణకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటుకాని ప్రస్తుత పరిస్థితుల్లో గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకం, పశుపోషణ.. రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. కాగా, పశువులు అనారోగ్యం బారిన పడినప్పుడు సేవలందించేందుకు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరతను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం తాజాగా.. ఉన్న పశు వైద్యశాలలను హేతుబద్ధీకరించి వాటి సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా జిల్లా అధికారులు పశు సంవర్థకశాఖ డైరెక్టరేట్‌కు ఇప్పటికే మూడు రకాల నివేదికలు పంపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పశువైద్యశాలలు, వైద్యుల హేతుబద్ధీకరణకు పూనుకుంటే పశువైద్యం మరింత దూరం అవుతుందని పోషకులు ఆందోళన చెందుతున్నారు. 


మండలానికి ఒకటి లేదా రెండు మాత్రమే 

జిల్లాలో ఆవులు, ఎద్దులు 5.72 లక్షలు, బర్రె జాతి పశుసంపద 0.47 లక్షలు, గొర్రెలు 7.04 లక్షలు, మేకలు 3.45 లక్షలు, ఇతరత్రా  ఉత్పత్తి జీవాలు 17 లక్షలు వరకు ఉన్నాయి. అవి వ్యాఽధుల బారిన పడినప్పుడు చికిత్స చేసేందుకు జిల్లావ్యాప్తంగా 80 గ్రామీణ లైవ్‌స్టాక్‌ కేంద్రాలు, 98 వెటర్నరీ డిస్పెన్సరీలు, 19 వెటర్నరీ అసుపత్రులు, ఒక ప్రయోగశాల, ఒక పాలిక్లీనిక్‌లు ఉన్నాయి. వీటికి తోడు 820 రైతు భరోసా కేంద్రాల్లోనూ వ్యవసాయ సహాయకులతో పశుసంవర్థశాఖ సహాయకులను నియమించారు. అయితే పశువైద్య సహాయకులతో వైద్యం చేయించి గ్రామీణ పశువైద్యశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడున్న సిబ్బందిని ప్రాంతీయ, మండల స్థాయి పశువైద్యశాలల్లో సర్దుబాటుకు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ దిశగా జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దీంతో జిల్లాలో పలు గ్రామీణ పశువైద్యశాలలు మూతపడే అవకాశం ఉంది. 


పశుపోషకుల్లో ఆందోళన 

పశువైద్యశాలలు, వాటిలో పని చేసే సిబ్బంది సంఖ్యను తగ్గిస్తే సకాలంలో సేవలు అందక పశు పోషకులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుంది. కొన్ని మండలాల్లో గ్రామీణ పశువైద్యశాలలు తక్కువగా ఉండటంతో పాటు చాలా చోట్ల ఆసుపత్రుల మధ్య దూరం పెరుగుతుంది. దీంతో పశువైద్యం సకాలంలో అందదని పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. 


ఆదేశాలు రాలేదు 

పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌ ఆదేశాల మేరకు జిల్లాలో  ఆసుపత్రులు, సిబ్బంది తదితర వివరాలపై నివేదిక తయారు చేసి పంపించాం. ఎన్ని ఆసుపత్రులు మూతపడతాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం మూడు ఆప్షన్లు సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటిది పాత విధానం. రెండోది.. ఏరియాకు వెటర్నరీ ఆస్పత్రి ఉంటూ అదనంగా ప్రతి మండలంలో రెండు పశువైద్యశాలలు (డిస్పెన్షరీలు) ఏర్పాటు చేయడం. మూడోది.. ఏరియా ఆస్పత్రితో పాటు మండలంలో మూడు పశు వైద్యశాలలు ఉంచుతూ.. గ్రామీణ పశు వైద్య కేంద్రాలను తగ్గించడం. ఇందులో ఏ విధానం అమలు చేస్తుందనేది స్పష్టత లేదు. ఏ విధానం అమలైనా సిబ్బంది తొలగింపు, పోస్టులు తగ్గించడం జరగదు. గోపాలమిత్రలను ఔట్‌సోర్సింగ్‌ కింద నియమిస్తాం. 

- డాక్టర్‌.ఎం.కిషోర్‌, జేడీ పశుసంవర్థకశాఖ.

Updated Date - 2021-08-24T05:44:52+05:30 IST