పెద్దల పట్ల మరింత శ్రద్ధ వహించాలి: వెంకయ్య

ABN , First Publish Date - 2020-10-01T15:36:46+05:30 IST

అంతర్జాతీయ పెద్దల దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వయోధికులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

పెద్దల పట్ల  మరింత శ్రద్ధ వహించాలి: వెంకయ్య

న్యూఢిల్లీ: అంతర్జాతీయ పెద్దల దినోత్సవం సందర్భంగా  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వయోధికులకు  ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పెద్దల పట్ల  మరింత శ్రద్ధ వహించాలని వెంకయ్య ఆకాంక్షించారు.  ‘‘అంతర్జాతీయ పెద్దల దినోత్సవ శుభాకాంక్షలు. వయోధికుల పట్ల తగినంత శ్రద్ధ చూపించడమే వారికి ఇచ్చే నిజమైన గౌరవం. కుటుంబంలో పెద్దలతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉండడం ద్వారా పిల్లలకు మార్గదర్శనం, ఓదార్పు లభిస్తాయి. తద్వారా ఉన్నత సమాజ నిర్మాణం సాధ్యమౌతుంది. వయోధికులకు అవసరమైన భౌతిక, సామాజిక, ఆర్థిక భద్రతతో పాటు గౌరవాన్ని, ఆరోగ్య భద్రతను కల్పించడం అత్యంత ఆవశ్యకం.  ముఖ్యంగా ప్రస్తుత కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో పెద్దల పట్ల  మరింత శ్రద్ధ వహించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ వెంకయ్య ట్వీట్ చేశారు.



Updated Date - 2020-10-01T15:36:46+05:30 IST