భాషానువాద అనువర్తనాల అవసరం ఎంతో ఉంది: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-08-03T01:07:57+05:30 IST

భారతదేశం వంటి బహుభాషా సమాజంలో భాషానువాద అనువర్తనాల అవసరం ఎంతో ఉందని, భాష అవరోధాలను తొలగించడం ద్వారా వివిధ భాషల్లోని విజ్ఞానాన్ని మిగిలిన సమాజానికి పంచేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

భాషానువాద అనువర్తనాల అవసరం ఎంతో ఉంది: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారతదేశం వంటి బహుభాషా సమాజంలో భాషానువాద అనువర్తనాల అవసరం ఎంతో ఉందని, భాష అవరోధాలను తొలగించడం ద్వారా వివిధ భాషల్లోని విజ్ఞానాన్ని మిగిలిన సమాజానికి పంచేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.సోమవారం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో రూపొందుతున్న బహుభాషా అనువాద అనువర్తనాన్ని ఆ సంస్థ ప్రతినిధులు ఉపరాష్ట్రపతితోపాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సమక్షంలో ప్రదర్శించారు.ఆంగ్లంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో ఈ అనువాదం ఎలా జరుగుతుందనే అంశాన్ని వారు వివరించారు. ఆయా భాషల్లోని పుస్తకాలను, పరిశోధనాత్మక వ్యాసాలను, ప్రభుత్వ దస్తావేజులను, వీడియోలను వెనువెంటనే ఈ అనువర్తనం అనువాదం చేస్తుందన్నారు. అనువాద అనువర్తనం గురించి వారు చెప్పిన వివరణను ఆసాంతం విన్న ఉపరాష్ట్రపతి దీనికి సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. 


అనంతరం ఆయన మాట్లాడుతూ బహుభాషల సమాహారమైన భారతదేశంలో భాషావరోధాలను దాటి ముందడుగేసినప్పుడే మరింత ప్రగతి సాధ్యమవుతుందన్నారు.కృత్రిమ మేధ సహాయంతో పనిచేసే ఇలాంటి అనువర్తనాల సాయంతో సాంకేతిక విద్య భారతీయ భాషల్లో అందుబాటులోకి రావాలన్నది తమ కల అన్న ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కృత్రిమమేధ సహాయంతో సమాజంలోని అన్నివర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా వివిధ భాషల్లోని ఆడియోలు, వీడియోలకు వెనువెంటనే అనువాద వీడియోలు రావడం రానున్న రోజుల్లో ఎంతగానో ఉపయుక్తం అవుతుందన్నారు.


ఈ అనువర్తనం వెనకున్న ఉద్దేశ్యాలను, 70-80 శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్న తీరును అభినందించిన ఉపరాష్ట్రపతి, మరింత కచ్చితత్వాన్ని, వినియోగానికి మరింత అనుకూలంగా (యూజర్ ఫ్రెండ్లీ) ఉండేలా మార్పులు, చేర్పులు చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ అనువర్తనం దిశగా చొరవ తీసుకున్న ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధేని, ఈ అనువర్తనం తయారీలో కీలకంగా వ్యవహరించిన బుద్ధా చంద్రశేఖర్, బృంద సభ్యులను ఉపరాష్ట్రపతి అభినందించారు.

Updated Date - 2021-08-03T01:07:57+05:30 IST