ఆమె విస్మరించజాలని వీరనారి: వెంకయ్య నాయుడు

ABN , First Publish Date - 2020-11-23T00:09:04+05:30 IST

“గోవాను ప్రత్యేకంగా భారతదేశంలో భాగం చేయవలసిన అవసరం లేదు. ఇది శతాబ్ధాల నుంచి భారతదేశంలో అంతర్భాగం. దాన్ని విభజించినది మీరే.

ఆమె విస్మరించజాలని వీరనారి: వెంకయ్య నాయుడు

హైదరాబాద్: “గోవాను ప్రత్యేకంగా భారతదేశంలో భాగం చేయవలసిన అవసరం లేదు. ఇది శతాబ్ధాల నుంచి భారతదేశంలో అంతర్భాగం. దాన్ని విభజించినది మీరే. మిమ్మల్ని ఈ భూమి నుంచి తొలగించిన తర్వాత, గోవా స్వయంచాలకంగా భారతదేశంలో భాగం అవుతుంది.” గోవా భారతదేశంలోనే ఎందుకు ఉండాలని కోరుకుంటున్నారన్న న్యాయమూర్తి ప్రశ్నకు సుధతాయ్ జోషి సమాధానమిది. మన దేశం బ్రిటీష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొంది 75 ఏళ్ళ మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో గత నాలు శతాబ్ధాలుగా భారతదేశాన్ని బ్రిటీష్ వారు మాత్రమే కాకుండా, పోర్చుగీసు వారు కూడా పరిపాలించారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.


1961 డిసెంబర్ 19 వరకూ గోవా పోర్చుగీస్ ఆక్రమణలో ఉంది. గోవా చివరి గవర్నర్ జనరల్ అయిన జనవర్ మాన్యువల్ ఆంటోనియో వాస్సలో డి సిల్వా లొంగిపోయేలా చేసేందుకు భారత సాయుధ దళాలు 36 గంటల ఆపరేషన్ విజయ్ ను విజయవంతంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన భారత స్వరాజ్య పోరాటానికి సమాంతరంగా సాగిన గోవా విముక్తి ఉద్యమానికి గోవా నేషనల్ కాంగ్రెస్ నాయకత్వం వహించింది. మన స్వాతంత్ర్య ఉద్యమంలో తమ ధైర్య సాహసాలను చూపించిన వీరనారీమణులు గురించి కొనసాగిస్తున్న నా మనోగతంలో భాగంగా గోవాను విదేశీయుల పాలన నుంచి స్వేచ్ఛ దిశగా నడిపించేందుకు, భారతదేశంలో మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించేందుకు కృషి చేసిన భారతమాత వీర పుత్రిక సుధతాయ్ జోషి అని ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన తన మనోగతంలో  వారి కుటుంబ సభ్యుల శౌర్యం, త్యాగం గురించి తెలియజేయడం ద్వారా ఆ మహిళా మూర్తి స్మృతికి నివాళులు అర్పిస్తానని తెలిపారు. 


1918లో గోవాలోని ప్రియాల్ గ్రామంలో ఓ సంప్రదాయ కుటుంబంలో జన్మించిన సుధతాయ్ చిన్నతనంలో విద్యను అభ్యసించలేదు. 13 సంవత్సరాల వయసులోనే పూణేకు చెందిన మహాదేవ్ శాస్త్రి జోషితో ఆమె వివాహం జరిగింది. మహాదేవ్ జోషి స్వతహాగా గొప్ప పండితులు. సంస్కృత సాహిత్యానికి తలమానికమైన భారతీయ సంస్కృత కోష్ ను ఆయన సంకలనం చేశారు. వివాహం తర్వాత ఆమె ఇద్దరు సవతి కుమార్తెలతో పాటు, ఆమె అత్తగారిని చూసుకోవలసిన బాధ్యతను ఆమె స్వీకరించారు. మహారాష్ట్రలో సాధువుల నుంచి, కవుల రచనల నుంచి, ఇతిహాసాలు సహా ఇతర గ్రంథాల నుంచి ఆమె స్వీయ అభ్యాసం కొనసాగించారు. ఇది ఆమె దృక్పథాన్ని మరింతగా విస్తరించడానికి సహాయపడింది.


గోవా నేషనల్ కాంగ్రెస్ పూణె విభాగానికి అధిపతిగా మహాదేవ్ జోషి గోవా విముక్తి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఒకసారి ఆయన ఉద్యమంలో పాల్గొనేందుకు గోవా వెళ్ళవలసి వచ్చినప్పుడు అప్పటికే ఆయనకు శస్త్ర చికిత్స జరిగి ఉన్నందున ఆయన్ను ఆపి, బదులుగా భర్త తరుఫున ఉద్యమంలో పాల్గొనేందుకు సుధతాయ్ ముందుకు వచ్చారు. “నేను అగ్నిలో దూకేందుకు సిద్ధమయ్యాను గనుక, నేను మీ అనుమతి కూడా తీసుకోను. నా నిర్ణయం అంతిమమైనది”. ఆమె నిర్ణయం నిశ్చయమైనది మరియు మార్చలేనిది. ఈ విషయాన్ని మహదేవ్ శాస్త్రి జోషి తన ఆత్మకథ అయిన ‘ఆత్మపురాణ్’లో వివరించారు. 


ఏప్రిల్ 1955లో సుధతాయ్ మొదటి సారి గోవా కాంగ్రెస్ సమావేశాన్ని మపుసాలో నిర్వహించారు. ఆమె ప్రసంగించడం ప్రారంభించిన వెంటనే అకస్మాత్తుగా ఒక పోలీసు అధికారి వచ్చి, ఆమెకు తుపాకీ గురిపెట్టాడు. కొంత మంది ప్రచారకులు జాతీయ జెండాలను ఎగురవేస్తూ జైహింద్ అంటూ నినాదాలు చేస్తూ ఉండగా, ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం సుధతాయ్ని అరెస్టు చేసి జైలులో ఉంచారు. వాస్తవానికి మాతృభూమిని విదేశీ పాలన నుంచి స్వేచ్ఛ దిశగా నడిపించే ఉద్యమంలో ఆమెతో పాటు ఆమె కుటుంబం మొత్తం పాల్గొంది. కొంతకాలం తర్వాత స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆమె సోదరి ఆశాతాయ్ మరియ ఆమె సోదరుడు ఘన శ్యామ్ ఫడ్కేను పోర్చుగీస్ అధికారులు అరెస్టు చేశారు.


ఆరు నెలల జైలు శిక్ష అనంతరం, విచారణ ప్రారంభమైన నేపథ్యంలో, ‘గోవా భారతదేశంలో ఉండాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు..?’ అన్న న్యాయమూర్తి ప్రశ్నకు ఆమె అద్భుతమైన సమాధానం ఇచ్చారు. “గోవాను ప్రత్యేకంగా భారతదేశంలో భాగం చేయవలసిన అవసరం లేదు – ఇది శతాబ్ధాల నుంచి భారతదేశంలో అంతర్భాగం. దాన్ని విభజించినది మీరే. మిమ్మల్ని ఈ భూమి నుంచి తొలగించిన తర్వాత, గోవా స్వయంచాలకంగా భారతదేశంలో భాగం అవుతుంది.” అంటూ ధైర్యంగా చెప్పారు. 


అనంతరం న్యాయమూర్తి క్షమాపణ చెప్పవలసిందిగా ఆమె మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించడంతో పాటు, గోవాకు తిరిగి రాకుండా ఆమెను బహిష్కరిస్తున్నట్లు చెప్పాడు. దానికి ఆమె మరో సారి “ఇది నా మాతృభూమి. నేను ఇక్కడకు వచ్చి ఎప్పుడైనా వెళ్ళగలను. మీరు నా కుటుంబం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో నా కుటుంబం కంటే నా దేశం చాలా ముఖ్యమైనది. మీరు కోరుకున్న శిక్షను నాకు వేయండి. అంతే తప్ప నేను ఎప్పటికీ క్షమాపణ చెప్పను, మీ దయను కోరను” అంటూ గర్జించారు. ఆ సమయంలో ఆమెకు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 


జైలులో ఆమెను ఒక ఏడాది పాటు మానవాతీత పరిస్థితుల్లో ఉంచారు. పోర్చుగీస్ అధికారుల దారుణ వైఖరికి వ్యతిరేకంగా ఆమె నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆమె అనారోగ్యం, నిరాహార దీక్ష వార్తలు బయటకు వ్యాపించిన దరిమిలా పోర్చుగీసు వారిపై ఒత్తిడి పెరిగింది. శ్రీ వినోబా భావే కూడా ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఓ లేఖ రాశారు. ఆమె జైలు శిక్ష విషయం భారత పార్లమెంట్ లో ప్రస్తావనకు రాగా, నాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ఆ రోజుల్లో భారతదేశం మరియు పోర్చుగల్ మధ్య ప్రత్యక్ష దౌత్య సంబంధాలు లేవు. పోర్చుగల్ బ్రెజిల్ ద్వారా భారతదేశాన్ని సంప్రదించగా, భారతదేశం ఈజిప్ట్ ద్వారా పోర్చుగల్ ను సంప్రదించింది. ఆమెను కలిసేందుకు భారత ప్రభుత్వం ఈజిప్టు అధికారిని గోవాకు పంపింది. చివరకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం భారతదేశం నుంచి భారీ దౌత్యపరమైన ఒత్తిడి మేరకు, సుధతాయ్ విడుదలయ్యారు.


ఆమె విడుదల తర్వాత ప్రభుత్వం ఆమెకు లోక్ సభలో గౌరవ స్థానం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని చెబుతారు. అయితే ఆమె ప్రజాజీవితం నుంచి వైదొలగి, కుటుంబ సభ్యులతో గడిపారు. ఆమె ధైర్యం, మాతృభూమి పట్ల నిస్వార్థ నిబద్ధతకు ఈ కర్మభూమి బిడ్డలుగా ప్రతి ఒక్కరూ శిరసు వంచి ప్రణమిల్లాలి. 


నా మనోగతం ధారావాహికల్లో భాగంగా చిన్న గ్రామాలు మరియు పట్టణాలతో పాటు దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతం నుంచి సాధారణ మహిళల అసాధారణ ధైర్య, త్యాగాలను మనం చూస్తూ వచ్చాము. అయితే వారి జీవన గాథలకు మన చరిత్ర పుస్తకాల్లో చోటు దక్కలేదు. ఇలాంటి మహనీయుల జీవితాలను చరిత్ర పుస్తకాల్లో లిఖించడం ద్వారా వారికి మనమంతా నివాళులు అర్పించుకోవాలి. 


Updated Date - 2020-11-23T00:09:04+05:30 IST