విద్యాదాత తీర్థం క్రిష్ణయ్యశెట్టి మృతి
ABN , First Publish Date - 2021-05-17T05:37:48+05:30 IST
పలమనేరు పట్టణంలోని తీర్థం క్రిష్ణయ్యశెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాల దాత తీర్థం క్రిష్ణయ్యశెట్టి (90) ఆదివారం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
పలువురి సంతాపం
పలమనేరు, మే16 : పలమనేరు పట్టణంలోని తీర్థం క్రిష్ణయ్యశెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాల దాత తీర్థం క్రిష్ణయ్యశెట్టి (90) ఆదివారం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్కళాశాలకు ఆయన రెండు దశాబ్దాల క్రితమే రూ. 10లక్షలు కార్పస్ ఫండ్ చెల్లించడంతో పాటు కళాశాలకు పలు సొంత భవనాలు నిర్మించారు. అంతేకాకుండా లైబ్రరీ, ప్రయోగశాల, కంప్యూటర్ విద్యకోసం కావలసిన సామగ్రి సమకూర్చారు. విద్యార్థులకోసం డెస్కులు ఏర్పాటుచేశారు. కళాశాల అభివృద్ధికి ఆయన రూ.70 లక్షలపైగా వెచ్చించారు. బైరెడ్డిపల్లె మండలం తీర్థం ఆయన స్వగ్రామం. తీర్థం క్రిష్ణయ్యశెట్టి వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయనకు నలుగురు సంతానం. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తీర్థం క్రిష్ణయ్యశెట్టి పలుధార్మిక కార్యక్రమాలకు బూరివిరాళాలు ఇవ్వడంతోపాటు పలమనేరులోని ఆర్యవైశ్యులతో సన్నిహితంగా వుండేవారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.