రికార్డుల గల్లంతు..!
ABN , First Publish Date - 2022-01-20T06:07:52+05:30 IST
జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కీలకమైన రికార్డుల మాయంపై ఇప్పటికే తాడేపల్లిగూడెం, భీమడోలుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి తేడాలను గుర్తించారు.
జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
తాడేపల్లిగూడెంలో స్టాంపుల గల్లంతుపై చర్యలు : జిల్లా రిజిస్ర్టార్ ఆదేశం
జంగారెడ్డిగూడెం టౌన్/తాడేపల్లిగూడెం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కీలకమైన రికార్డుల మాయంపై ఇప్పటికే తాడేపల్లిగూడెం, భీమడోలుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి తేడాలను గుర్తించారు. ఇదే తరహాలో జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. వీటి వివరాలు వెల్లడించడంలో అధికారులు గోప్యత పాటించడంతో రికార్డుల్లో ఏదో తేడాలున్నట్టు ప్రజలు భావి స్తున్నారు. అందిన సమాచారం మేరకు ఈ కార్యాలయంలో 1వ నెంబర్ బుక్తో పాటు సుమారు ఇరవై రికార్డులు గల్లంతైనట్లు తెలుస్తోంది. విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విచారణ దశలో ఉన్నందున వివరాలను వెల్లడిం చలేమని చెప్పారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామ న్నారు. ఈ తనిఖీలతో సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
మరోవైపు తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో స్టాంపుల గల్లంతు పై తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ర్టార్ లంకా వేంకటేశ్వర్లు ఆదేశాలు జారీచేశారు. బుధవారం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాన్ని సందర్శించారు. స్టాంపుల గల్లంతుపై మరోమారు ఆరా తీసి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్థానిక సబ్ రిజిస్ర్టార్ను ఆదేశించారు.