అది రైటెలా అవుతుంది?.. కేసీఆర్‌కు విజయశాంతి సూటిప్రశ్న

ABN , First Publish Date - 2021-06-18T21:53:13+05:30 IST

ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా

అది రైటెలా అవుతుంది?.. కేసీఆర్‌కు విజయశాంతి సూటిప్రశ్న

హైదరాబాద్: ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాలే నిదర్శనమన్నారు. భూములమ్మి వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. 


‘‘ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ గారు... నేడు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సర్కారు భూమి అన్నదే లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అత్యంత కీలకమైన భూములను పెద్ద మొత్తంలో అమ్మేసి, రాష్ట్రాన్ని ప్రయివేటీకరించడమే తెలంగాణ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ భూముల అమ్మకాలపై మంత్రి హరీష్‌రావు గారు ఈ మధ్య స్పందిస్తూ... గత ప్రభుత్వాలు భూములమ్మగా లేంది... మేం చేస్తే తప్పా? అని అడిగారు. ఆ సర్కార్లు చేసిన తప్పును ఆనాడు అన్ని వర్గాలూ ఎండగట్టాయి. అదే తప్పు మీరు చేస్తే, అది రైటెలా అవుతుంది?... ఈ అవకతవక రెవెన్యూ విధానాలతో పాటు తెలంగాణలో కుప్పకూలుతున్న మరొక వ్యవస్థ ఉన్నత విద్యా రంగం. మొన్నటి వరకూ రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీలు లేక వ్యవస్థ గాడి తప్పింది. ఈ విషయమై రాష్ట్ర సర్కారుకు స్వయంగా గవర్నరే ఘాటుగా లేఖ రాసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెరపైకి వచ్చిన మరో అంశం ఈ వర్శిటీలను తీవ్రంగా వేధిస్తున్న ప్రొఫెసర్ల కొరత. దాదాపు 3 వంతుల పోస్టులు (2,152) ఖాళీగా ఉన్నాయంటే విద్యా వ్యవస్థను ఈ సర్కారు ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 1000 పైచిలుకు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నాలుగేళ్ళ కిందటే నిర్ణయం తీసుకుని కూడా భర్తీ చెయ్యలేదు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ తెలంగాణ సర్కారు కుప్పకూలితే గాని మంచి రోజులు రావు’’ అని విజయశాంతి పేర్కొన్నారు. 



Updated Date - 2021-06-18T21:53:13+05:30 IST