పౌరుడికి అప్పులెట్లా?.. అటుకులు బుక్కిన కేసీఆర్‌కి ఆస్తులెట్ల?: రాములమ్మ

ABN , First Publish Date - 2021-12-07T16:33:23+05:30 IST

తెలంగాణలో సగటు పౌరుడికి అప్పులెట్లా పెరిగాయి? అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే సీఎం కేసీఆర్‌కి ఆస్తులెట్ల పెరిగినయ్ అని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు.

పౌరుడికి అప్పులెట్లా?.. అటుకులు బుక్కిన కేసీఆర్‌కి ఆస్తులెట్ల?: రాములమ్మ

హైదరాబాద్: తెలంగాణలో సగటు పౌరుడికి అప్పులెట్లా పెరిగాయి? అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే సీఎం కేసీఆర్‌కి ఆస్తులెట్ల పెరిగినయ్ అని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం అప్పులు, మిత్తికే సరిపోతోందన్నారు. చివరకు మిత్తీలు కట్టేందుకు కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 16 వేల కోట్ల మిగులు రెవెన్యూ ఏర్పడిన రాష్ట్రంలో గడిచిన 7 ఏడేళ్ల కేసీఆర్ పాలనలో ఏకంగా 4 లక్షల కోట్ల అప్పులు మిగిలాయన్నారు.


‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే మన ఉద్యోగాలు మనకు, మన నీళ్లు మనకు, మన నిధులు మనకొస్తాయని ఆశపడిన తెలంగాణ ప్రజలకు నేడు నిరాశ, అప్పులే మిగిలాయి. ఏడేండ్ల కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబ ఆస్తులు, భూములు పెరిగినై తప్ప, అసలు భూములే లేని దళితులకు ఎకరం భూమి దక్కలే. 2004లో కేసీఆర్ కుటుంబం ఆస్తుల విలువ 85 లక్షల ఉంటే... 2018 నాటికి 100కోట్ల రూపాయలకు చేరింది. ఇవన్నీ వారికి వారుగా ఎన్నికల సంఘానికి సమర్పించుకున్న లెక్కలు మాత్రమే. ఇక కనిపించని ఆస్తుల లెక్కలు వేల కోట్లలోనే ఉంటాయనేది అందరికీ తెలిసిన సత్యమే. 16 వేల కోట్ల మిగులు రెవెన్యూ ఏర్పడిన రాష్ట్రంలో గడిచిన 7 ఏడేళ్ల కేసీఆర్ పాలనలో ఏకంగా 4 లక్షల కోట్ల అప్పులు మిగిలాయి. కాగా, తెచ్చిన అప్పులకు కట్టిన మిత్తే 92 వేల కోట్లయితే... కట్టాల్సిన కిస్తీల పైకం ఇంకో 33 వేల కోట్లుగా ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో సగం అప్పులు, మిత్తిలకే సరిపోతోంది. అయితే మిత్తీలు కట్టేందుకు కూడా మళ్ళీ అప్పులు తేవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన్రు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏడేళ్లలో ఇంత దిగజారిపోతే... సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తులకు ఎదిగిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ పదే పదే చెప్పేమాట... అటుకులు బుక్కి ఉద్యమం చేసినం... అని. నిజంగా అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే ఇన్ని ఆస్తులు ఎట్ల పెరిగినయ్? ఉద్యమంలో పాల్గొన్న సగటు తెలంగాణ పౌరుడికి అప్పులు ఎందుకు మిగిలినయ్? ఉద్యమం మాటున కేసీఆర్ ఆస్తులు పెంచుకున్నడు తప్ప ఇంకేమైనా ఉందా? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఆస్తులు దారపోసి కొట్లాడిన అనేక మంది ఉద్యమకారులకు దక్కింది ఏంటి? ఉద్యమం మాటున ఫామ్ హౌస్ భూములు పెంచుకున్న కేసీఆర్.... ఏదో ఒక రోజు ఈ లెక్కలు బయటికి రాకతప్పదని గ్రహించి, 2006లోనే ఒక సమాథానాన్ని కనిపెట్టాడు. అదే... ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాననే దివ్యమంగళ మంత్రం. అక్రమ సంపాదనను వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంగా చూపి తప్పించుకునే ప్రయత్నం 2006 నుంచే మొదలు పెట్టిండు కానీ... ఎప్పటికైనా ఆయన చేసిన అక్రమార్జన బట్టబయలు చేసి తెలంగాణ సమాజానికి పంచక తప్పదు’’ అని రాములమ్మ పేర్కొన్నారు.


Updated Date - 2021-12-07T16:33:23+05:30 IST