‘రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకున్నాడనుకుంటున్నా’

ABN , First Publish Date - 2021-01-19T19:41:32+05:30 IST

ముఖ్యమంత్రిపై విజయశాంతి ఫైర్ అయ్యారు.

‘రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకున్నాడనుకుంటున్నా’

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుకున్నాడని తాను అనుకుంటున్నట్లు బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో రాములమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై విజయశాంతి ఫైర్ అయ్యారు. మహిళలపై అత్యాచారాలను నియంత్రిచడంలో సీఎంగా కేసీఆర్ విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. ఎన్‌కౌంటర్ చేయటమే సమస్యకు పరిష్కారం కాదని హితవు పలికారు. 


బూతులు మాట్లాడుతున్నారు!

మహిళల భద్రత కోసం చట్టాలను సరిగ్గా అమలు చేయటంలో కేసీఆర్‌కు చేతకావటంలేదు. టీఆర్ఎస్‌లో రౌడీలున్నారా?. ముఖ్యమంత్రి కంటే ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు. బీజేపీని చించేయమని టీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు. వ్యాక్సినేషన్ సమయంలో ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఫాంహౌస్ బయటకు రాలేదు. బహుశా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకున్నాడనుకుంటున్నాను. టీఆర్ఎస్‌లో ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నేతవరకు బూతులే మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో విచ్చల విడిగా దోపిడీలు, కబ్జాలతో రాష్ట్రం నాశనం అయ్యింది. టీఆర్ఎస్ దోపిడీ దొంగలను ప్రజల ముందు దోషులుగా నిలబెడతాంఅని విజయశాంతి చెప్పుకొచ్చారు.


ఆడది ఆదిపరాశక్తి..!

తెలంగాణలో బీజేపీ అధికారంలోకొస్తే రాష్ట్రం రూపురేఖలు మారుతాయి. తెలంగాణలో మలి ఉద్యమం రావాల్సిన అవసరముంది. తెలంగాణ ప్రజలు అమాయకులు.. వారిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత మనపై ఉంది. దుబ్బాక ఉపఎన్నికలో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలు కీలక పాత్ర పోషించారు. మూడేళ్ళ పాటు ఓపిక చేసుకుని కష్టపడితే బీజేపీని అధికారంలోకి తీసుకురావచ్చు. సమాజంలో ఎన్నో కష్టసుఖాలను మోసేది మహిళ. ఇంటిని తీర్చిదిద్దేది మహిళ.. ఆడది ఆదిపరాశక్తి.. ఎప్పుడు ఏపాత్ర పోషించాలో తెలుసు. మహిళలను ప్రోత్సహిస్తే వెనకపడిపోతామని కొంతమంది పురుషులు అనుకుంటారు. మహిళలను ఎదుర్కునే శక్తి లేకనే సోషల్ మీడియాలో మహిళలను కించపర్చేలా పోస్ట్‌లు పెడతారుఅని రాములమ్మ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-01-19T19:41:32+05:30 IST