ధనిక రాష్ట్రాధిపతికి ఆ అర్హత ఉందా? కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

ABN , First Publish Date - 2021-12-14T02:02:51+05:30 IST

రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ లేనిపోని అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గారి సర్కారు.... వడ్ల రైతులకు బకాయిలు చెల్లించడంలో ఘోరంగా విఫలమై వారిని కన్నీటి పాలు చేస్తున్న తీరుపై గణాంకాలతో సహా మీడియాలో వచ్చిన కథనానికి జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు..

ధనిక రాష్ట్రాధిపతికి ఆ అర్హత ఉందా? కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు చేసి రైతులకు బకాయిలు చెల్లించకుండా చోద్యం చూస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే అర్హత లేదని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి విమర్శించారు. ధనిక రాష్ట్రమంటూనే రైతులకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదో చెప్పాలని కేసీఆర్‌ను ఆమె నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలున్నాయంటూ విమర్శించారు. ఈ విషయమై ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ..


‘‘రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ లేనిపోని అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గారి సర్కారు.... వడ్ల రైతులకు బకాయిలు చెల్లించడంలో ఘోరంగా విఫలమై వారిని కన్నీటి పాలు చేస్తున్న తీరుపై గణాంకాలతో సహా మీడియాలో వచ్చిన కథనానికి జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఇంతకు ముందు వడ్లు కొనుగోలు చేసి, రైతులకు వారం పది రోజుల్లోనే చెల్లించే పౌరసరఫరాల శాఖ ఇప్పుడు నెలలు గడుస్తున్నా చెల్లించక రైతుల్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిప్పుకునే దుస్థితి నెలకొంది. తెలంగాణలో అక్టోబరు చివరి వారంలో ధాన్యం కొనుగోళ్లు మొదలవగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఇప్పటివరకు 41.50 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ రూ. 8,134 కోట్లు కాగా, ఇంత వరకు రూ.4,550 కోట్లు మాత్రమే అన్నదాతలకు చెల్లించారు. రైతులకు రూ. 3,584 కోట్లు చెల్లించాల్సి ఉంది. దాదాపు 6.60 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సర్కారు ఇప్పటివరకు 2.50 లక్షల మంది రైతులకు మాత్రమే డబ్బులు చెల్లించింది, మరో 4.10 లక్షల మంది రైతులకు వడ్ల పైసలు అందలేదు. ఈ క్రమంలో రైస్ మిల్లర్లు కూడా అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చి, ఓపీఎమ్మెస్‌లో వివరాలు నమోదు చేస్తే తప్ప రైతులకు డబ్బులందే పరిస్థితి లేదని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాలతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చడం ఆలస్యమై రైతులు ఆగమైతున్నరు. అన్నదాతల డబ్బు వారికివ్వడానికి నానా అగచాట్ల పాలు చేస్తున్న ధనిక రాష్ట్రాధిపతికి అసలు కేంద్రాన్ని నిందించే అర్హత ఉందా?... తక్షణం వడ్ల రైతులకు న్యాయం చెయ్యకపోతే వారి ఆగ్రహజ్వాలల్లో అధికార పార్టీ దగ్ధం కాక తప్పదు’’ అని విజయశాంతి రాసుకొచ్చారు.



Updated Date - 2021-12-14T02:02:51+05:30 IST