పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటినా.. స్పందించరా?: శైలజానాథ్
ABN , First Publish Date - 2021-07-13T18:06:30+05:30 IST
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ నగరంలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.
విజయవాడ: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ నగరంలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఎం.జి. రోడ్లోని పెట్రోల్ బంక్ ఎదుట చేపట్టిన నిరసనలో ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాధ్, ఎఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ...కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. 14లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారనేది ఒక లెక్క అని అన్నారు. చమురు ధరలు తగ్గినా పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటినా .. స్పందించరా అని నిలదీశారు. అసలు ధర కంటే... ట్యాక్స్ల పేరుతో దండుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. పెట్రోల్ ధరల వల్ల అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరిగి పోయాయని తెలిపారు. 17 వరకు ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆందోళనలు చేస్తామని అన్నారు. మోదీని కనీసం ఇదేమిటి అని అడగలేని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు. ఎవరైనా ప్రశ్నిస్తే... అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు వేసుకుని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటారా అని మండిపడ్డారు. 17న కర్నూలులో భారీ సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు శైలజానాథ్ తెలిపారు.