విజయవాడలో ఘంటసాల 98వ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-12-04T16:55:57+05:30 IST

ప్రముఖ గాయకుడు ఘంటసాల 98వ జయంతి వేడుకలను సాంస్కృతికశాఖ ఘనంగా నిర్వహించింది.

విజయవాడలో ఘంటసాల 98వ జయంతి వేడుకలు

విజయవాడ: ప్రముఖ గాయకుడు ఘంటసాల 98వ జయంతి వేడుకలను సాంస్కృతికశాఖ ఘనంగా నిర్వహించింది. నగరంలోని ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన జయంతి వేడుకల్లో టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ క్రియేటివిటీ, కల్చరల్‌ కమిషన్ చైర్ పర్సన్‌ సాంస్కృతిక శాఖ చైర్ పర్సన్ వంగ పండు ఉష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో మంది కళాకారుల పుట్టినిల్లు కావటం విశేషమన్నారు. కృష్ణ జిల్లాలో పుట్టిన ఘంటసాల ఎంతో గొప్ప కీర్తిని తన పాటలతో సంపాదించుకున్నారని చెప్పుకొచ్చారు. ఎంతో గొప్ప పాటలు పాడిన మహనీయులు అని కొనియాడారు. తెలుగు పాట ఉన్నంత కాలం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళలకు కళాకారులకి ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో పేద కళాకారులను కూడా ఆదుకుంటామని మంత్రి అవంతి హామీ ఇచ్చారు. 




బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ...సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘంటసాల 98వ జయంతి విజయవాడలో ఘనంగా నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. భక్తి గీతాలు పాడటంలో ఆయనని మించిన వారు లేరని కొనియాడారు. ఆయన మరణించినా తెలుగు ప్రజల గుండెల్లో బ్రతికి ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కళలకి ప్రోత్సాహం అందించటంలో ఎప్పుడూ ముందు ఉంటుందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-04T16:55:57+05:30 IST