విజయవాడ: 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ శంఖారావం
ABN , First Publish Date - 2021-12-05T19:10:30+05:30 IST
ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించనున్నారు.
విజయవాడ: ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించనున్నారు. ఉద్యోగుల సమస్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలు సహా ఆందోళనపై కార్యాచరణ వివరిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యా సాగర్ మాట్లాడుతూ 13లక్షల ఉద్యోగులను సమాయత్త పరిచేందుకు కార్యక్రమాలను చేపట్టామన్నారు. 2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు పీఆర్సీ రిపోర్టు బయటపెట్టలేదని, 7 పెండింగ్ డీఏలను నిలుపుదల చేసిన రాష్ట్రం ఏదీ లేదన్నారు. డీఏ బకాయులను ఇవ్వని ఏకైక సర్కార్ ఎపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. సీపీఎస్ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఆందోళనను కొనసాగిస్తామని విద్యాసాగర్ స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ సంఘం నేత సుందరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయడం సహా పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు.
పెన్షనర్స్ అసోసియేషన్ నేత గాలి నాయుడు మాట్లాడుతూ ఉద్యోగులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు.