విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్కు నారా లోకేష్ లేఖ
ABN , First Publish Date - 2022-01-21T17:21:34+05:30 IST
టీడీపీ నేత నారా లోకేష్ విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్కు లేఖ రాశారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్కు లేఖ రాశారు. గుంటూరు జిల్లా, తాడేపల్లి మున్సిపాలిటీలోని 6, 14, 15, 16 వార్డుల పరిధిలోని రైల్వే భూముల్లో సుమారుగా 650 కుటుంబాలు కొన్నేళ్లుగా నివసిస్తున్నాయన్నారు. సుమారు 40 ఏళ్లుగా అక్కడే ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన వీరందరికీ పనికెళ్తే కానీ పూట గడవని దయనీయస్థితిలో జీవిస్తున్నారన్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు రైల్వే అధికారులు జనవరి 22 లోపు ఇళ్లు ఖాళీ చెయ్యాలని నోటీసులు ఇవ్వడంతో అక్కడ నివసిస్తున్న పేద ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. కోవిడ్ కారణంగా పనులు లేక పూట గడవటమే ఇబ్బందిగా మారిన వాళ్ళకి రైల్వే నోటీసులతో నిలువ నీడ కూడా లేకుండా పోతోందనే ఆవేదనలో ఉన్నారన్నారు. వారికి వీలైనంత త్వరగా ప్రభుత్వం స్థలం కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి స్థలం కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించే వరకూ తాడేపల్లి రైల్వే స్థలంలో నివాసితులకు మానవతా దృక్పథంతో అక్కడ ఉండే అవకాశం ఇవ్వాలని లోకేష్ ఆ లేఖలో కోరారు.