విజయవాడలో వైఎస్సార్ జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2021-07-08T16:07:53+05:30 IST
నగరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
విజయవాడ: నగరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ... ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచారన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లో జగన్ వెళ్తున్నారని తెలిపారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్ సొంతమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆరోగ్యానికి జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ...వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేత దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకోవాలని.... వైఎస్సార్, జగన్ గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవని హెచ్చరించారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ...వైఎస్సార్ ఐదు సంవత్సరాల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. నేడు జగన్ పాలన చూసి ఓర్వలేక ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.