విక్రమ సింహపురి వర్సిటీ వీసీగా సుందరవల్లి బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-11-27T07:30:48+05:30 IST
నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ జీఎం సుందరవల్లి శుక్రవారం ఆ వర్సిటీలో బాధ్యతలు స్వీకరించారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 26: నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ జీఎం సుందరవల్లి శుక్రవారం ఆ వర్సిటీలో బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎస్వీయూ ఇంగ్లీషు విభాగం ప్రొఫెసర్ అయిన ఈమె ఇక్కడ రెక్టార్గా వ్యవహరించారు. వీసీగా నియమితులైన ఈమెను బోధనేతర ఉద్యోగ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పీకే సుబ్రమణ్యం, నెల్లూరు సుబ్రమణ్యం, ఆల్ యూనివర్సిటీస్ వైఎ్సఆర్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేతంరెడ్డి మురళిరెడ్డి, ఎస్వీయూ టైం స్కేల్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఎర్రసాని సుబ్రమణ్యంరెడ్డి, విద్యార్థులు, ఉద్యోగులు అభినందించారు.
సుందరవల్లి నేపథ్యమిదీ
ఎస్వీయూ ఆంగ్ల విభాగంలో ప్రొఫెసర్ రాధామణి గోపాలకృష్ణన్ పర్యవేక్షణలో ‘ప్లాస్టిక్ థియేటర్- టెన్నిసీ విలియమ్స్ నాటకాలు’ అంశంపై సుందరవల్లి 1995లో పీహెచ్డీ పూర్తి చేశారు. 1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) చైర్పర్సన్, ఇంగ్లీషు విభాగాధిపతిగా, ఉమెన్ హాస్టల్ వార్డెన్గా, రెక్టార్గా పని చేశారు. 29 ఏళ్ల బోధనానుభవం గల ఈమె నాలుగు సదస్సులను నిర్వహించారు. ఆమె పర్యవేక్షణలో 11 పీహెచ్డీలు, 10 ఎంఫిల్ డిగ్రీలు పూర్తయ్యాయి. ఈమె తల్లి ఎస్వీయూ క్యాంపస్ స్కూల్ హెడ్ మిసె్సగాను, తండ్రి ప్రొఫెసర్ హెర్బర్ట్ యూనివర్సిటీ ఫిలాసఫీ విభాగంలో ప్రొఫెసర్గా పని చేశారు. సుందరవల్లి భర్త క్రిస్టోఫర్ ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో డెయిరీ టెక్నాలజీ అధ్యాపకుడిగా పనిచేశారు.
ఎస్వీయూ కొత్త రెక్టార్గా మురళీధర్?
ఎస్వీయూ రెక్టార్గా సుందరవల్లి స్థానంలో ప్రస్తుత వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ బీవీ మురళీధర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసిన ప్రొఫెసర్ సావిత్రమ్మ పేరుకూడా వినిపిస్తోంది. వీసీ రాజారెడ్డి ఓసీ, రిజిస్ట్రార్ హుస్సేన్ బీసీ కావడంతో రెక్టార్ పదవిని ఎస్సీలకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకని ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.