ప్రతీ పల్లె అభివృద్ధే లక్ష్యం... మంత్రి అజయ్
ABN , First Publish Date - 2021-06-23T05:11:33+05:30 IST
ప్రతీ పల్లె అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం రఘునాథపాలెం మండలంలో పర్యటించిన ఆయన ఎన్వీ బంజర, కోటపాడులో వైకుంఠధామం,
అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు అలసత్వం వహించొద్దు
రఘునాథపాలెం మండల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
రఘునాథపాలెం, జూన్ 22 : ప్రతీ పల్లె అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం రఘునాథపాలెం మండలంలో పర్యటించిన ఆయన ఎన్వీ బంజర, కోటపాడులో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో రాజీలేకుండా కృషి చేస్తున్నామని, నిధులు వెచ్చించి వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలను ఏర్పాటు చేశామని మురికికూపాలుగా ఉన్న గ్రామాలను మెరుగుపర్చామన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో తండాలు, మారుమూల పల్లెలు కూడా సీజనల్ వ్యాధులకు దూరంగా ఉంటున్నాయన్నారు. గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీలు, గ్రామాలను కలిపే లింకురోడ్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అన్ని వసతులు కల్పిస్తు గ్రామస్వరాజ్యం సాధించుకున్నామని, కరోనాను కట్టడి చేయటంలో ముందు వరసలో ఉన్నామన్నారు. శరవేగంగా అన్ని వర్గాల వారికి కరోనా టీకాలు అందించి ప్రజల ప్రాణాలను దక్కించుకుంటున్నామని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు జరగాలని సూచించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం వహించకూడదన్నారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్.. కోటపాడు శానిటేషన్ గురించి ఎంపీవో శాస్ర్తిని అడగ్గా.. కోటపాడు శానిటేషన్ చాలా బాగా ఉందని, ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎంపీవో వివరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, ఎంపీపీ గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, జడ్పీటీసీ ప్రియాంక, సర్పంచ్ బాతుల రమణ సుధాకర్, ఉపసర్పంచ్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మందడపు సుధాకర్, కుర్రా భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.