ఖమ్మం నగరానికి దీటుగా గ్రామాల అభివృద్ధి : మంత్రి పువ్వాడ అజయ్
ABN , First Publish Date - 2021-01-18T04:40:11+05:30 IST
ఖమ్మం నగరానికి దీటుగా గ్రామాల అభివృద్ధి : మంత్రి పువ్వాడ అజయ్
రఘునాథపాలెం పర్యటనలో మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మంలోనూ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
ఖమ్మం కార్పోరేషన్, జనవరి 16: నగరానికి దీటుగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా ఖమ్మం సమీప గ్రామాల రూపురేఖలు మారుస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలంలో రూ.4.25కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం వి.వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసినసభలో మంత్రి మాట్లాడుతూ గ్రామ ముఖద్వారాలు, రహదారుల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్లైటింగ్తో ఆకర్షణీయంగా తయారు చేస్తున్నామన్నారు. త్వరలోని శ్రీశ్రీ విగ్రహం నుండి వి. వెంకటాయపాలెం వరకు నాలుగు లేన్ల రహదారిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుడా పరిధిలోని ప్రతీ గ్రామంలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలని సుడా చైరన్, నగరపాలక సంస్థ కమిషనర్కు సూచించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కమిషనర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ నగర పరిధిలో, రఘునాథపాలెం మండలంలో చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. సభలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీపీవో వీ. ప్రభాకర్రావు, పంచాయతీరాజ్ ఈఈ చంద్రమౌళి, రఘునాథపాలెం ఎంపీపీ భూక్యా గౌరి, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, వీ.వెంకటాయపాలెం, మంచుకొండ ఎంపీటీసీలు హన్మంతరావు, తేజావత్ వాణి, సర్పంచ్లు రావెళ్ల మాధవి, వాంకుడోత్ విజయ, తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లలో రహదారుల విస్తరణ..
ఖమ్మం నగర అభివృద్ధిలో భాగంగా ప్రతీ డివిజన్లో రహదారుల విస్తరణ, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నగరంలోని 16వ డివిజన్ బోనకల్రోడ్, 17వ డివిజన్ సుగ్గలవారితోట, 20 డివిజన్ జమ్మిబండ ప్రాంతాల్లో రూ.1.25కోట్లతో చేపట్టనున్న నిర్మాణ పనులకు మంత్రి, మేయర్ డాక్టర్ జి.పాపాలాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రెయిన్లు, రహదాఉల విస్తరణతోపాటు సెంట్రల్ లైటింగ్ జంక్షన్లు ఏర్పాటుచేసి నగరాన్ని సుందరంగా మారుస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగజయంతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మందడపు మనోహర్, పునుకొల్లు నీరజ, కర్నాటి కృష్ణ, నగరపాలక సంస్థ ఈఈ కృష్ణాలాల్, డీఈ రంగారావు పాల్గొన్నారు.