HYD : సాగర్లో వద్దంటే నిమజ్జనం ఎక్కడ చేయాలి..!?
ABN , First Publish Date - 2021-09-12T16:07:28+05:30 IST
గణేశ్ నిమజ్జనానికి 2019 తరహాలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో...
హైదరాబాద్ సిటీ : గణేశ్ నిమజ్జనానికి 2019 తరహాలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్రావు డిమాండ్ చేశారు. హుస్సేన్సాగర్తో పాటు ఇతర జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాల్లో నిమజ్జనం చేయరాదంటే.. గణనాఽథులను ఎక్కడ నిమజ్జనం చేయాలో చెప్పాలన్నారు.
అమీర్పేటలో శనివారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సాగర్లో నిమజ్జనానికి ముందు, తర్వాత నీటిపరీక్షలు నిర్వహించిన నివేదికలను ప్రభుత్వ అధికారులు కోర్టు ముందు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పీఓపీతో విగ్రహాలు తయారు చేయవచ్చని గతంలో ప్రభుత్వమే జీవో ఇచ్చిందని, ఇప్పటివరకు ఆ జీవో అలాగే కొనసాగుతోందన్నారు. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం స్పందించకపోతే హిందూ ధార్మికసంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణకు దిగుతామని అన్నారు. విగ్రహాలకు సహజసిద్ధమైన రంగులను వాడాలని చెప్పిన ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేయడంలో ఎలాంటి ముందస్తుఏర్పాట్లు చేయలేదన్నారు. సమితి వైస్ ప్రెసిడెంట్ రామరాజు, సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఉపాఽధ్యక్షుడు కరొడిమల్, తదితరులు పాల్గొన్నారు.