మోదీకి విశాలమైన ఛాతీ ఉంది కానీ.. విశాల హృదయం లేదు

ABN , First Publish Date - 2020-11-22T09:54:17+05:30 IST

ప్రధాని మోదీకి విశాలమైన ఛాతీ ఉందే కానీ విశాల హృదయం లేదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

మోదీకి విశాలమైన ఛాతీ ఉంది కానీ..   విశాల హృదయం లేదు

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ 


హైదరాబాద్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీకి విశాలమైన ఛాతీ ఉందే కానీ విశాల హృదయం లేదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. మోదీ పాలనలో రైతులు, కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం సీనియర్‌ న్యాయవాది రవీందర్‌రెడ్డితోపాటు పలువురు న్యాయవాదులు వినోద్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ బీమా రంగంలో 75 శాతం వాటా ఉన్న ఎల్‌ఐసీని అమ్మడం కూడా దేశభక్తేనా? అని ప్రశ్నించారు. రిలయన్స్‌ వారి జియో కోసం బీఎ్‌సఎన్‌ఎల్‌ను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతమైన హైదరాబాద్‌లో కొన్ని పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయాలను యువతకు తెలియజెప్పాలని, హైదరాబాద్‌లో టీఆర్‌ఎ్‌సను గెలిపించేందుకు కృషి చేయాలని న్యాయవాదులకు సూచించారు.


పక్క రాష్ట్రంలో పనికి రాని వ్యక్తితో హైదరాబాద్‌లో రాజకీయాలా?: బాల్క సుమన్‌

పక్క రాష్ట్రంలో దేనికీ పనికి రాని వ్యక్తిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వ్యాఖ్యానించారు. ఏపీలో రెండు చోట్ల పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. ఒక్క చోటా గెలవలేక పోయారని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థుల్లో సగానికిపైగా డిగ్రీ పూర్తి చేసిన వారున్నారని తెలిపారు. ప్రతిపక్షాల మాలుఉ  ప్రజలకు కామెడీ షోలా ఉన్నాయని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. తన హోదాకు తగ్గట్లుగా హుందాగా ఉండాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ నేతలపై వ్యక్తిగత విమర్శలు మానుకుని, అభివృద్ధిపై మాట్లాడాలని హితవు పలికారు. 

Updated Date - 2020-11-22T09:54:17+05:30 IST